Future City: 1500 ఎకరాలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:56 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరించాలని నిర్ణయించింది. రాజధాని శివారులో ఏడు మండలాల్లోని 74 గ్రామాల పరిధిలో ప్యూచర్ సిటీ ఏర్పాటుకు ఇటీవలే క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు.. సేకరణకు సర్కారు సన్నాహాలు
తిమ్మాయిపల్లిలో 366, కొంగరకుర్ధులో 277 ఎకరాల కోసం నోటిఫికేషన్
త్వరలో తిమ్మాపూర్, పంజాగూడలోనూ భూ సేకరణ
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/కందుకూరు/ మహేశ్వరం)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరించాలని నిర్ణయించింది. రాజధాని శివారులో ఏడు మండలాల్లోని 74 గ్రామాల పరిధిలో ప్యూచర్ సిటీ ఏర్పాటుకు ఇటీవలే క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సేకరించిన భూమితో పాటు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ పరిధిలో మరో 1500ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం రెండు గ్రామాల్లో పారిశ్రామిక పార్కుల పేరుతో 643 ఎకరాల భూమి సేకరణకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసింది. కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో 366.04 ఎకరాలు, కొంగర కుర్ధులో 277ఎకరాల సేకరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు ఇందులో దాదాపుగా అన్నీ అసైన్డ్ భూములే ఉన్నాయి.
ఈ వారంలోనే మరో 900 ఎకరాల దాకా భూసేకరణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కందుకూరు మండలం తిమ్మాపూర్లో 600ఎకరాలు, పంజాగూడ గ్రామంలో 300ఎకరాల సేకరణకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిన భూముల్లో ఎక్కువ భాగం వర్షాధార పంటలు సాగవుతున్నాయి. తిమ్మాయిపల్లిలోని 80ఎకరాల్లో వరి, 20ఎకరాల్లో కూరగాయలు, మిగతా భూముల్లో జొన్న, మొక్కజొన్న పండిస్తుండగా, కొంత బీడు భూమి ఉంది. కొంగరకుర్ధులో సేకరించనున్న 277 ఎకరాలు.. 1972, 1989, 1992లో 200మందికి లావణి పట్టాలతో పంపిణీ చేశారు. వీటిలోనూ రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో ఐటీ పార్కు లేదా పారిశ్రామకివాడ ఏర్పాటుకు 198ఎకరాలు సేకరించనున్నారు. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.