కార్పొరేట్కు దీటుగా ‘ఆదర్శ’బోధన
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:25 AM
ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధిస్తున్నారు.

కార్పొరేట్కు దీటుగా ‘ఆదర్శ’బోధన
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన
ప్రవేశాలకు నోటిఫికేషన విడుదల
ఈ నెల 28వ తేదీ వరకు ఆనలైనలో దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 13వ తేదీన ప్రవేశపరీక్ష
నాంపల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఈ విద్యను సద్వినియోగం చేసుకొని పదవ తరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. నాంపల్లి మండలంలో గల పెద్దాపురం గ్రామంలో గల ఆదర్శ పాఠశాల 6 నుంచి 10వ తరగతిలో మిగిలిన ఖాళీల కోసం ప్రభుత్వం నోటిఫికేషన విడుదల చేసింది. పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు ఉంటాయి. ప్రతీ సంవత్సరం 6వ తరగతిలో 100 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు 500మంది విద్యార్థులు ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదే కా కుండా ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ విద్యార్థులకు విద్య అందుబాటులో ఉంది. దూర ప్రాంత బాలికలకు హాస్టల్ సౌకర్యం ఉంది. 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల ఆదర్శ పాఠశాలల్లో చేరడానికి 2025-26 విద్యా సంవత్సరానికి ఈ నెల 28 వరకు అవకాశం ఉంది.
అధునాతన వసతులు
ఆదర్శ పాఠశాలల్లో అధునాతన భవనంతో విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేస్తూ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంచుతున్నారు. విద్యార్థులకు అకాడమిక్ విద్యతో పాటు ఎంసెట్, నీట్ వంటి శిక్షణ కూడా ఇస్తున్నారు. దూర ప్రాంత విద్యార్ధులకు ఇంటర్ చదువుతున్న బాలికలకు 100 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నారు.
స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత
ఆదర్శ పాఠశాల ప్రవేశాల్లో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత ఇతర మండలాల విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షలో తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్లం పాఠ్యాంశాలపై 25 మార్కుల చొ ప్పున ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలు ఓఎంఆర్ షీట్లో గుర్తించాల్సి ఉంటుంది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెరిట్, రిజర్వేషన ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
ప్రతిభ చాటుతున్న విద్యార్థులు
ఆదర్శ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ప్రతి భ చాటుతున్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో 10 జీపీఏ సాధిస్తున్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు.
ఆనలైనలో మాత్రమే దరఖాస్తుల స్వీకరణ
ఆదర్శ పాఠశాలలో చేరడానికి ఆనలైనలో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. బోనఫైడ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు పాస్ఫొటోతో మీ సేవ, ఇంటర్ నెట్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూ.125, జనరల్ విద్యార్థులకు రూ.200 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 13వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. 6వ తరగతి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ప్రశాంత వాతావరణంలో విద్యా బోధన
విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో ఆంగ్ల మాధ్యమంలో వి ద్యా బోధన జరుగుతుంది. విద్యార్థులు సృజతనాత్మక మార్పులు తే వడానికి కృషి చేస్తున్నాం. పోటీ ప రీక్షల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చడానికి మా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్, పెద్దాపురం, నాంపల్లి