Mahabubabad: దామరవంచ గురుకులంలో కలుషిత ఆహారం
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:52 AM
వీరిలో నలుగురు తీవ్రంగా, 12 మంది స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. గురుకులంలోని సుమారు 530 మంది విద్యార్థులకు గురువారం సాయంత్రం స్నాక్స్ కింద గుడాలు, రాత్రి భోజన సమయంలో కాకరకాయ కూర, సాంబారు వడ్డించారు.

16 మంది విద్యార్థులకు అస్వస్థత
రాత్రి భోజనం తర్వాత వాంతులు, వీరేచనాలు
గూడూరు (మహబూబాబాద్ జిల్లా), ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు తీవ్రంగా, 12 మంది స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. గురుకులంలోని సుమారు 530 మంది విద్యార్థులకు గురువారం సాయంత్రం స్నాక్స్ కింద గుడాలు, రాత్రి భోజన సమయంలో కాకరకాయ కూర, సాంబారు వడ్డించారు. అది తిన్న వారిలో 16 మంది విద్యార్థులకు అర్ధరాత్రి దాటాక వాంతులు, వీరేచనాలు కాగా శుక్రవారం తెల్లవారుజామునకు విషయం తెలుసుకున్న గురుకుల సీనియర్ ప్రిన్సిపాల్ రమేష్, జూనియర్ ప్రిన్సిపాల్ రాజమౌళి, వార్డెన్ అప్పారావు, ఉపాధ్యాయుల సహాయంతో గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన లకావత్ రాహుల్, గుగులోతు సాయిప్రసాద్, బానోత్ యాకూబ్, అనిల్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ వీరన్న వెల్లడించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు.