అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:39 AM
అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి అటవీ రేంజర్ అధికారి షౌకత్అలీ హెచ్చరించారు.

- మెట్పల్లి అటవీ రేంజర్ అధికారి షౌకత్అలీ
మెట్పల్లి రూరల్, జనవరి, 3 (ఆంధ్రజ్యోతి) : అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి అటవీ రేంజర్ అధికారి షౌకత్అలీ హెచ్చరించారు. మండలంలోని రంగారావుపేట బీట్ కంపార్ట్మెంట్ పరిధిలో ఉన్న పాటిమీదితండా గ్రామ శివారులో అటవీ భూమిని చదును చేస్తూ కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు వచ్చిన సమాచారంతో ట్రాన్స్కో మెట్పల్లి ఏడీఈ మనోహర్తో కలిసి సందర్శించారు. అటవీ భూమిలో ఏర్పాటు చేసిన కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలను తొలగించారు. అటవీ భూమిలో కరెంట్ స్తంభాలు ఏర్పాటు వారిని విచారించారు. అనంతరం ఆత్మకూర్ గ్రామంలో చుట్టుఉన్న గ్రామస్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఆత్మకూర్, రంగరావుపేట, పాటిమీదతండా గ్రామాల్లో సుమారు వందల ఎకరాల అటవీ భూమిని చదును చేసి ఆక్రమిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాన్ని కబ్జా చేసి వ్యవసాయ భూములుగా మార్చడంతో అడవీ జంతువులు, చిరుత పులి సంచరిస్తుందని, అటవీ భూములు, చెట్లను కాపాడేందుకు గ్రామాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలోకి చొరబడి అక్రమంగా భూముల కబ్జాలకు పాల్పడేందుకు యత్నిస్తే కఠిన చర్చలు తీసుకుంటామన్నారు. తిరిగి వాటిని స్వాధీనం చేసుకునేందుకు దృష్టి సారిస్తామన్నారు. అటవీ భూమి సర్వే చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కిరణ్కుమార్, అనిల్, రాజు, అటవీ సెక్షన్ అధికారులు చైతన్యశ్రీ, అరుణ్కుమార్, బీట్ అధికారులు సత్తార్, శివరాజ్, అధికారులు, సిబ్బంది, గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.