Shilpa Shetty Raj Kundra: శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:46 AM
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలపై ముంబయి పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.
వ్యాపారిని రూ.60 కోట్ల మేర మోసగించినట్టు కేసు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంతానికి వాడుకున్నారని ఆరోపణ
ముంబయి, సెప్టెంబరు 5: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలపై ముంబయి పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. వారు విదేశాలకు పరారు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికార్లను సూచిస్తూ ఆర్థిక నేరాల విభాగం ఈ సర్క్యులర్ జారీ చేసింది. రుణం-పెట్టుబడి పేరుతో ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసగించారంటూ ఆగస్టు 14న జుహూ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. దీనిపై విచారణ జరగాల్సి ఉన్నందున వారు విదేశాలకు పరారు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ప్రయాణాలపై కన్నేసి ఉంచాలని సూచించింది.
లోటస్ క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారీ (60) ఆ దంపతులపై ఫిర్యాదు చేశారు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లయిన రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలు తనను తొలుత రూ.75 కోట్లు రుణం అడిగారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి నెలా వాయిదాల రూపంలో అసలు, వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వ్యాపారం కోసం ఇచ్చిన రుణాన్ని సొంత అవసరాల కోసం వాడుకున్నారని కొఠారీ ఆరోపించారు. 2017లో కంపెనీని దివాళా సంస్థగా ప్రకటించారని తెలిపారు. దాంతో కొఠారీ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారు. దీనిపై శిల్ప, రాజ్ల న్యాయవాది ప్రకటన జారీ చేస్తూ ఇది సివిల్ కేసని, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో 2024లోనే పరిష్కారమయిందని తెలిపారు.