పోలింగ్కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:36 AM
జిల్లాలో ఎమ్మె ల్సీ ఎన్నికల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పా ట్లు పూర్తి చేసింది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చొప్పదండి నియోజక వర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి, బీమా రం మండలాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా అధికారులు పూర్తి చేశారు.
జగిత్యాల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎమ్మె ల్సీ ఎన్నికల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పా ట్లు పూర్తి చేసింది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చొప్పదండి నియోజక వర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి, బీమా రం మండలాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రి బ్యూషన్, రిసిప్షెన్ కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకొని ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. సిబ్బందికి వారికి కేటాయించిన నిర్ణీత పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అవసరమైన ఏర్పాటు పూర్తి చేశారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ వేడిమి తగలకుండా షామియానాలు, తాగునీరు బయోటాయి లెట్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఓటరు స్లిప్పు ల పంపిణీ పూర్తయింది. ప్రత్యేక అవసరాలు గల ఓటర్ల కొరకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్చైర్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి(పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లు)కు రెండు విడతల శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పరిచారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఇన్, అవుట్ సబ్కాస్టింగ్
పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన నిఘా ఉంచారు. పోలింగ్ కేంద్రంలో ఇన్, అవుట్ సబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం బయట క్యూ పరిశీలించడానికి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించడానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
గ్రాడ్యుయేట్ ఓటర్లు : 35,281
జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు 35,281 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 21,667, స్త్రీలు 13,614 మంది ఉన్నారు. పట్టభ ద్రులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి 51 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధికంగా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రూమ్ నంబరు 26లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 949 మంది ఓటర్లు, రూమ్ నంబరు 27లోని పోలింగ్ కేంద్రంలో 941 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ బ్లాక్ రూమ్ నంబరు 3లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 373 మంది ఓటర్లు, వెల్గటూరులోని జడ్పీహైస్కూల్ రూమ్ 2లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 409 మంది ఓటర్లున్నారు.
ఉపాధ్యాయ ఓటర్లు : 1,769
జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 1,769 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,232 మంది, స్త్రీలు 537 మంది ఉన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ప్రత్యేకంగా 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 677 మంది ఓటర్లు, కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల రూమ్ నంబరు 30లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 326 మంది ఓటర్లు, అత్యల్పంగా బీమారం జడ్పీ హైస్కూల్లో 9 మంది ఓటర్లు, వెల్గటూరులో జడ్పీ హైస్కూల్ రూమ్ నంబరు 2లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 9 మంది ఓటర్లున్నారు.
పోస్టల్ బ్యాలెట్లు : 548
జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 548 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఇందులో 65 మంది పీఓలు, 65 మంది ఏపీఓలు, 160 మంది ఓపీఓలు, 180 మంది పోలీసు సిబ్బంది, 28 మంది మైక్రో అబ్జర్వర్లు, 50 ఇతర అధికారులున్నారు. కాగా ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకుంటూ ఫారం 12ను 324 మంది నుంచి అందినట్లు అధికారులు తెలిపారు.