Rajiv Swagruha: నేడే బండ్లగూడ స్వగృహ ఫ్లాట్ల లాటరీ
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:43 AM
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో బండ్లగూడ, పోచారంలో ఉన్న టవర్లలోని ఫ్లాట్లకు లాటరీ నిర్వహిస్తామని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు.
ఆగస్టు 1,2న పోచారంలో లాటరీలు : ఎండీ గౌతమ్
హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో బండ్లగూడ, పోచారంలో ఉన్న టవర్లలోని ఫ్లాట్లకు లాటరీ నిర్వహిస్తామని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు బండ్లగూడలోని 159 ఫ్లాట్లకు, ఆగస్టు 1, 2 తేదీల్లో పోచారంలోని ఫ్లాట్లకు లాటరీ నిర్వహిస్తామని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తొర్రూర్, బహుదూర్పల్లి, కుర్మల్గూడా ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో వేలం నిర్వహిస్తున్నామన్నారు. బండ్లగూడలోని స్వగృహ ఫ్లాట్కు ఇచ్చిన రశీదుతోనే ఈ ఓపెన్ ప్లాట్ల వేలంలోనూ పాల్గొనవచ్చునని ఆయన పేర్కొన్నారు.
బండ్లగూడ లాటరీలో ఫ్లాట్ దక్కని వారికి పోచారంలో అవకాశం కల్పిస్తున్నామని, బండ్లగూడలో ఇచ్చిన డీడీలతో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. పోచారంలో ఫ్లాట్ల దరఖాస్తుకు రేపటి వరకు గడువు ఉందన్నారు. ఈ లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ల (పీడీ)తో జరిగిన సమీక్షలో ఆ పథకం అమలుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగించాలని గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ చెప్పారు.