Hyderabad: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలుకు ఆసక్తి
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:54 AM
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పరిధిలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పలు టవర్లలో ఫ్లాట్లను విక్రయించేందుకు ఇచ్చిన ప్రకటనకు భారీ స్పందన లభిస్తోంది.
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పరిధిలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పలు టవర్లలో ఫ్లాట్లను విక్రయించేందుకు ఇచ్చిన ప్రకటనకు భారీ స్పందన లభిస్తోంది. బండ్లగూడ, పోచారంలోని ఈ ఫ్లాట్లను చూసి, వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు వస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉండడంతో గత రెండు, మూడు రోజుల్లో 2 వేల మందికిపైగా రావడం గమనార్హం. నాగోల్ బండ్లగూడలోని 159 ఫ్లాట్లకు, పోచారంలోని 601 ఫ్లాట్ల విక్రయానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. లాభాపేక్ష లేకుండా వీటిని విక్రయించనుంది.
చదరపు అడుగు ధరను రూ.2,500- రూ.3,000 వరకు నిర్ణయించింది. బండ్లగూడ ప్రాజెక్టులోని ఫ్లాట్లకు ఈ నెల 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 30న లాటరీ ద్వారా కేటాయిస్తామని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) సీ భాస్కర్రెడ్డి తెలిపారు. పోచారం ప్రాజెక్టులో ఫ్లాట్లకు ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఆగస్టు 1న లాటరీ ద్వారా కేటాయిస్తామన్నారు. తక్కువ ధరకే సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.