Railways: నేటి నుంచే తత్కాల్కు ఆధార్ లింక్
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:15 AM
తత్కాల్ టికెట్ కోసం ఆధార్ నెంబరును తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది.
సర్క్యులర్ జారీ చేసిన రైల్వే శాఖ
నేటి నుంచి అమల్లోకి రైలు చార్జీల పెంపు
ఏసీ- కి.మీ.కి 2 పైసలు.. నాన్ ఏసీ-1 పైసా
న్యూఢిల్లీ/హైదరాబాద్ సిటీ, జూన్ 30(ఆంధ్రజ్యోతి): తత్కాల్ టికెట్ కోసం ఆధార్ నెంబరును తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. తత్కాల్ టికెట్ కావాలనుకునే వారు ఆధార్ నెంబరును ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దాని ఆఽధారంగా టికెట్ మంజూరవుతుంది. తత్కాల్ టికెట్ల ప్రయోజనాన్ని అసలైన ప్రయాణికులు మాత్రమే పొందేలా ఈ మార్పులు చేసింది. బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించిన అనుమానాస్పద వ్యక్తులు టికెట్లు బుక్ చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకొంది. అలాంటి వ్యక్తులకు సంబంధించిన సుమారు 2.5 కోట్ల ఖాతాలను బ్లాక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అందువల్ల ఐఆర్సీటీసీ ద్వారా తత్కాల్ ఇ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ను తప్పనిసరి చేసింది. రైల్వే కౌంటర్ వద్ద కూడా ఇదే విధానం అమలవుతుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాలు ఆన్లైన్ వినియోగదారులకు, స్టేషన్లలోని కౌంటర్ల వద్ద నిలబడే వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్రావెల్ ఏజెంట్లు, అధీకృత ఏజెన్సీలు అరగంట తర్వాత టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆధార్ లేని వినియోగదారులు, తత్కాల్ టికెట్ బుకింగ్ను కౌంటర్లు లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల వద్ద చేసుకోవచ్చు. ఇది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. కాగా, రైల్వే చార్జీలను పెంచుతూ సోమవారం రైల్వే మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఏసీ ఎక్స్ప్రెస్/మెయిల్ రైళ్లకు ప్రతి కిలోమీటరుకు 2 పైసలు చొప్పున, నాన్ ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రతి కిలోమీటరుకు ఒక పైస చొప్పున పెంచుతున్నట్టు తెలిపింది. పెంచిన చార్జీలు మంగళవారం నుంచి (సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత) అమల్లోకి వస్తాయని పేర్కొంది. రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సబర్బన్ రైళ్లు, నెలవారీ సీజన్ టిక్కెట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.