పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై సర్వే
ABN , Publish Date - May 31 , 2025 | 05:07 AM
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో గోదావరిలో పలు నదుల ప్రవాహాలు సజావుగా కలవకుండా, ముంపునకు కారణమవుతున్నాయన్న తెలంగాణ అభ్యంతరాలపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పందించింది.
ఆరు నదుల ప్రవాహంపై జరపాలని సీడబ్ల్యూసీ నిర్ణయం
ఖర్చు పోలవరం ప్రాజెక్టు అథారిటీదే!
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో గోదావరిలో పలు నదుల ప్రవాహాలు సజావుగా కలవకుండా, ముంపునకు కారణమవుతున్నాయన్న తెలంగాణ అభ్యంతరాలపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పందించింది. ఆయా నదుల ప్రవాహాలపై సర్వే చేసేందుకు సమ్మతి తెలిపింది. సర్వే చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) కూడా సీడబ్ల్యూసీని కోరింది.
నదుల క్రాస్ సెక్షన్లకు సంబంధించిన వివరాలూ అందించింది. సర్వేకయ్యే వ్యయాన్ని పీపీఏ భరించనుంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్లోని కృష్ణా-గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ (కేజీబీవో)ను సీడబ్ల్యూసీ ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం లేఖ రాసింది. నదుల ప్రవాహాలపై సర్వే చేశాక, నివేదికపై తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో కౌంటర్ సంతకం చేయించాలని ఆదేశించింది.