చీటింగ్ కేసులో శ్రవణ్రావు బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
ABN , Publish Date - May 29 , 2025 | 04:55 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉండి ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రైవేట్ న్యూస్ చానల్ ఎండీ ఎ.శ్రవణ్కుమార్ తన బెయిల్ పిటిషన్ను బుధవారం హైకోర్టులో ఉపసంహరించుకున్నారు.
హీరాగోల్డ్ ఎండీ నౌహీరాషేక్కు దక్కని ఊరట
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉండి ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రైవేట్ న్యూస్ చానల్ ఎండీ ఎ.శ్రవణ్కుమార్ తన బెయిల్ పిటిషన్ను బుధవారం హైకోర్టులో ఉపసంహరించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర రక్షణ ఉత్తర్వులు పొందిన శ్రవణ్కుమార్ రావు.. అనూహ్యంగా ఇనుప ఖనిజం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన మోసం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు కక్షగట్టి సివిల్ వ్యవహారాన్ని క్రిమినల్ కేసుగా మార్చి అరెస్ట్ చేశారని.. తనను అక్రమంగా కేసులో ఇరికించిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత వారం ఈ పిటిషన్ విచారణకు రాగా హైకోర్టు వివరణ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. తాజాగా బుధవారం ఈ పిటిషన్ జస్టిస్ కే శరత్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. మరోవైపు.. హీరాగోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిపాజిటర్లను మోసం చేసిన కేసులో సదరు కంపెనీ ఎండీ నౌహీరాషేక్కు హైకోర్టులో ఊరట లభించలేదు. ట్రయల్కు హాజరుకాకపోవడంతో ట్రయల్ కోర్టు (దిగువ కోర్టు) జారీచేసిన నాన్బెయిలబుల్ వారంట్ను కొట్టేయాలని.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి హైకోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లి విజ్ఞప్తి చేయాలని సూచించింది.