బాధితులను ఆదుకుంటాం
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:58 AM
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.
రాజాపేట, యాదగిరిగుట్ట రూరల్, ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం రాజాపేట మండలం రేణుకుంట గ్రామంలో ఇటీవల పిడుగుపాటుతో గొర్రెలు మృతిచెంది నష్టపోయిన బాధితున్ని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశంతో కలిసి ఆయనను పరిమర్శించారు. రాష్ట్ర కురుమ సంఘం నుండి 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కురుమ కులస్థులను రాష్ట్ర కురుమ సంఘం ఆదుకుని మనోధైర్యాన్ని, భరోసాను కల్పిస్తుందన్నారు. వైపరీత్యాలతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వపరంగా సాయాన్ని అదించి ఆదుకుంటామని తెలిపారు. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేషం మాట్లాడుతూ బండి మల్లయ్య కుటుంబానికి రాష్ట్ర కురుమ సంఘం అండగా ఉంటుందని తెలిపారు. కురుమ కులస్థుల సంక్షేమం కోసం సంఘం పనిచేస్తుందని అన్నారు. రాజకీయంగా, విద్యపరంగా ఎదగాలని విద్య కోసం పేద కురుమలకు సాయం అందిస్తామని తెలిపారు. వృత్తితో పాటు విద్యలో కూడా కురుమ కులస్థులు ముందుండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జూకంటి ప్రవీణ్, మహేందర్గౌడ్, పెంటయ్య, నర్సింహులు, బక్కయ్య, సిద్దులు, వెంకటేశ, నరేష్, మల్లేశం తదితలరులు పాల్గొన్నారు. ఆత్మకూర్ మండలంలోని సింగారం గ్రామానికి చెందిన జిల్లా అయిలయ్య, గీతకు చెందిన సుమారు 50గొర్లు ఇటీవల కుక్కల దాడిలో మృతిచెందాయి. ఆర్థికంగా నష్టపోయిన ఆ కుటుంబానికి రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో బాధితులకు రూ.50వేలు యాదగిరిగుట్ట పట్టణంలో అందజేశారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే సంఘానికి సమాచారం ఇస్తే తప్పకుండా వారికి సహకారం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కురుమ సంఘం నాయకులు మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, బీరు మల్లయ్య, నర్సింహ్మ, పేరపు రాములు , కాదూరి అచ్చయ్య పాల్గొన్నారు.
సాంకేతిక పద్ధతులు అవలంభించాలి
కేత్రస్థాయి సందర్శన ద్వార రైతులు నూతన సాంకేతిక పద్దతులు అవలంభించవచ్చునని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ది బ్యాంక్ నాబార్డు వారి ఆర్థిక సహాకారంతో ఎస్అండ్టీ సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి డెయిరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సభ్యులు చేపట్టిన విజ్ఞాన క్షేత్ర సందర్శన బస్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డు అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని నాబార్డును అభినందించారు. ఇలాంటి యాత్రలు మెళకువలు తెలుసుకోవడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం వినయ్కుమార్, రైతులు చీర శ్రీశైలం, దంబాల వెంకట్రెడ్డి, శిఖ ఉపేందర్గౌడ్ పాల్గొన్నారు.