Share News

గ్రామాధికారులు వస్తున్నారు

ABN , Publish Date - May 10 , 2025 | 12:14 AM

భూభారతి చట్టం జూన్‌ 2 నుంచి అమలులోనికి రానుండగా, అదే రోజు నుంచే భూ సంస్కరణల అమలుకు రెవెన్యూశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రధానంగా ప్రతి రెవెన్యూగ్రామానికి ఒక గ్రామపాలనాధికారితో పాటు, మరో లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ను నియమించనుంది.

గ్రామాధికారులు వస్తున్నారు

ప్రతీ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి, సర్వేయర్‌

భూవివాదాల పరిష్కారమే లక్ష్యంగా ‘భూభారతి’

జూన్‌ 2నుంచి కొత్తచట్టం అమలు

ప్రతీ గ్రామంలో సదస్సులు నిర్వహించి సమస్యల పరిష్కారం

సాదాబైనామాలు పరిష్కరించే దిశగా..

సమగ్ర భూసర్వే చేయాలనే డిమాండ్లు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ) : భూభారతి చట్టం జూన్‌ 2 నుంచి అమలులోనికి రానుండగా, అదే రోజు నుంచే భూ సంస్కరణల అమలుకు రెవెన్యూశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రధానంగా ప్రతి రెవెన్యూగ్రామానికి ఒక గ్రామపాలనాధికారితో పాటు, మరో లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ను నియమించనుంది. సుమారు పదేళ్లుగా భూ పట్టా ల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభు త్వం పరిష్కరించనుంది. అంతేకాక సాదాబైనామా లు, ఇతర భూవివాదాలను పరిష్కరించనుంది.

భూ వివాదాల పరిష్కారానికి ప్రతీ రెవెన్యూ గ్రా మాన్ని తహసీల్దార్‌ నేతృత్వంలోని బృందం సందర్శించనుందని, దీనిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాల ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఈ నెల 8న నల్లగొండ జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 9,26,000 సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని,అర్హులైనవారికి పట్టాలు సైతం ఇస్తామని మం త్రి ప్రకటించడంతో సాదాబైనామాల దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూమిమోఖాపై ఉన్న ప్రతీ రైతుకు,న్యాయబద్ధంగా ఉంటే పట్టా ఇస్తామని తేల్చిచెబుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

పాలనాధికారి, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌

గత ప్రభుత్వం ధరణిని అమలులోకి తేవడంతోపాటు, వీఆర్వో వ్యవస్థను పూర్తిగా తొలగించింది. దీంతో గ్రామాల్లో రెవెన్యూ పాల నా వ్యవస్థ లేకుండా పోయింది. కాంగ్రెస్‌ ప్రభు త్వం ధరణి చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునఃప్రవేశపెట్టాల ని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్‌ లెవల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (పూర్వపు వీఆర్‌వో స్థాయి), మరో లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ను నియమించాలని నిర్ణయించింది. వీఎల్‌వోల కోసం పూర్వపు వీఆర్‌వోలు, అర్హత కలిగిన వీఆర్‌ఏలను దరఖాస్తు చేసుకోవాలని సూచించి, వారికి అవకాశం కల్పించగా, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లుగా ప్రైవేట్‌ సర్వేయర్లకు, సర్వే శిక్షణ పొందిన యువతకు అవకాశం కల్పిస్తోంది. వీరందరికీ శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగించనుంది. సర్వేయర్ల కొరతతో ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో భూముల వివాదాలు నెలకొన్నాయి. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక సర్వేయర్‌ను నియమిస్తే సర్వేల సమస్యలు పరిష్కారమవుతుందనే నమ్మకంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీఎల్‌ఏలు, సర్వేయర్లు జూన్‌ 2నుంచి విధుల్లోకి రానున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,372 రెవెన్యూ గ్రామాల్లో ప్రతీ గ్రామానికి ఒక వీఎల్‌వో, మరో సర్వేయర్‌ నియామకం కానున్నారు.

భూమల రీసర్వే చేయాల్సిందేనని డిమాండ్లు

గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్న సందర్భంలో ప్రభుత్వం పాత అనుభవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సమగ్ర భూసర్వే నిర్వహించాలనే సూచనలు వస్తున్నా యి. భూసర్వేతో పాటు కొత్త నక్షాలు, కొత్త రెవెన్యూ రికార్డులు రాయాలనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ సర్వేయర్లు కాకుండా తిరుమలగిరి (సాగర్‌) తరహా ప్రభుత్వ సర్వేయర్లతో సమగ్రంగా భూముల సర్వే నిర్వహించి భూధార్‌ నెంబర్‌ లేక సర్వేనెంబర్లు కే టాయించాలని కోరుతున్నారు. అదేవిధంగా కొత్త గ్రామ నక్షాలు, కొత్త రెవెన్యూ గ్రా మాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ భూములకు కంచెలు వేయాలని, ప్రభుత్వ ఆస్తులైన దేవాదాయ, వక్ఫ్‌, రిజర్వ్‌ఫారెస్ట్‌ భూములకు, చెరువులు, కుంటలు, గ్రామకంఠం భూములు, శ్మశానవాటికలకు హద్దులు నిర్ణయించాలని కోరుతున్నారు. ప్రతీ పంచాయతీని ఒకరెవెన్యూ గ్రామంగా గుర్తించి రికార్డులు, నక్షాలు రూపొందించాలనే అభిప్రాయాలు వస్తున్నాయి.

జూన్‌ 2 తర్వాత రెవెన్యూ సదస్సులు

భూభారతి చట్టం అధికారికంగా జూన్‌ 2వ తేదీ నుంచి అమల్లోకి రానుండటంతో, అదే రోజు నుంచి ప్రతీ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పిం చింది. తహసీల్దార్‌ నేతృత్వంలోని రెవెన్యూ బృం దాలు ప్రతీ రెవెన్యూ గ్రామంలో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకొని పరిష్కరిస్తారు. భూభారతితో దాదాపు 80శాతం సమస్యలు తహసీల్దార్‌ స్థాయిలోనే పరిష్కారమవుతుండగా, మరో 10శాతం ఆర్డీవో, ఇంకో 10శాతం కలెక్టర్‌ స్థాయిలో పరిష్కారమయ్యే అవకాశముందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో భూ సమస్యలున్నవారంతా గ్రామాల్లో జరిగే సదస్సుల్లో సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. ఈ సదస్సులను తొలుత పైలెట్‌ మండలాల్లో, ఆతర్వాత భూ సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నిర్వహిస్తారని, ఆ తదుపరి క్రమంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని నిర్ణయించారు.

అసైన్డ్‌భూముల అంశం 2017 ప్రామాణికం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధానంగా నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట రెవెన్యూ డివిజన్లలో అసైన్డ్‌భూముల పట్టాల వివాదాలు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే భూభారతిలో వీటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధానంగా గిరిజన, ఆదివాసీ, దళితులకు సంబంధించి పట్టాదారులే ఈ సమస్యలను ఎదుర్కొంటుండడంతో దీని పరిష్కారానికి భూభారతిలో అవకాశం కల్పించారు. అయితే 2017 తర్వాత అసైన్డ్‌పట్టాలు ఉంటే చెల్లవని, అంతకు ముందు ఉన్న పట్టాలుంటే వాటి ఆధారంగా క్రయ, విక్రయాలు, లావాదేవీలు ఉంటే వాటిని పరిశీలించి మోఖాపై ఉన్న రైతులకు పట్టాలివ్వాలని నిర్ణయించారు. పంచనామా, సర్వే నిర్వహించి ఈ పట్టాలు అందిస్తారు. అయితే సాగుదారు తప్పనిసరిగా మోఖాపై ఉండాల్సిందేనని, 2017కు ముందే అసైన్డ్‌ అయిన భూమి అయి ఉండడంతో పాటు, లావాదేవీ, క్రయవిక్రయాలు సైతం అంతకు ముందే జరిగి ఉండాలనే నిబంధనను కచ్చితంగా వర్తింపజేయనున్నారు. ఈ వెసులుబాటులో పెండింగ్‌లో ఉన్న అసైన్డ్‌ పట్టాల సమస్యలకు పరిష్కారం లభించనుంది.

సాదాబైనామాలకు మోక్షం

గ్రామీణ ప్రాంత భూముల వివాదాల్లో కీలకమైన సాదాబైనామా రిజిస్ట్రేషన్లకూ భూభారతిలో మోక్షం కలగనుంది. భూభారతి అమల్లోకి వచ్చిన వెంటనే ఆర్డీవోల ద్వారా సాదాబైనామాల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. 2014కు ముందు సాదాబైనామా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినవారికి భూభారతిలో రిజిస్ట్రేషన్‌ చేసి, పట్టాలు అందించాలని నిర్ణయించారు. ఆర్డీవో స్థాయిలో వీటిని పరిష్కరించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ ప్రవేశపెట్టినప్పుడు సైతం సాదాబైనామాలకు రిజిస్ట్రేషన్ల అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ దరఖాస్తులు తీసుకొని వదిలేశారు. 2020 అక్టోబరు, నవంబరు నెలల్లో ఈ దరఖాస్తులు తీసుకున్నారు. వాటినే ఇప్పుడు పరిష్కరించాలని నిర్ణయించారు. సాదాబైనామాల ద్వారా భూముల కొనుగోలు చేసిన రైతులు మోఖాపై వారే ఉంటున్నప్పటికీ, రిజిస్ట్రేషన్లుకాకపోవడంతో పట్టాలు పొందలేకపోయారు. దీంతో ప్రభుత్వం అందించే రైతుభరోసా, రైతుబీమా, పంటరుణాలు, ఎరువుల సబ్సిడీ, ఇతరత్రా ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఈ డిమాండ్‌ ప్రధానంగా ఉండడంతో భూభారతిలో ఈ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాదాబైనామాల కింద సుమారు 1,60,263 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ ఆయా ఆర్డీవోలు పరిశీలించి పరిష్కారించనున్నారు.

Updated Date - May 10 , 2025 | 12:14 AM