రేషన్ పంపిణీపై విజిలెన్స్
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:59 PM
వర్షాకాలంతోపాటు ప్రకృతి విపత్తుల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉం డేందుకు మూడు నెలల రేషన్ (ఆహారభద్రతా కార్డులు) బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. రేషన్ బియ్యం పంపిణీపై ప్రభు త్వం నిఘాను ఏర్పాటుచేసింది.
మూడురోజులుగా ఉమ్మడి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు
మూడు నెలల బియ్యం పంపిణీపై ఆరా
గోదాములు, రేషన్దుకాణాల్లో అధికారుల తనిఖీలు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): వర్షాకాలంతోపాటు ప్రకృతి విపత్తుల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉం డేందుకు మూడు నెలల రేషన్ (ఆహారభద్రతా కార్డులు) బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. రేషన్ బియ్యం పంపిణీపై ప్రభు త్వం నిఘాను ఏర్పాటుచేసింది. కేంద్ర ప్రభు త్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి..., జిల్లా అధికారులను సమాయత్తంచేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని జూన్ 25లోగా పంపిణీ చేయాలని తగిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని రేషన్షాపులకు బియ్యాన్ని సరఫరా చేసింది. ప్రభుత్వం పంపి ణీ చేస్తున్న బియ్యం సక్రమంగా పేదలకు అందుతున్నాయా? లేదా అని నిఘా పెట్టింది.
రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సివిల్సప్లయ్ బియ్యం పంపిణీపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాదా ద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో గురు, శుక్ర, శని వారాల్లో గోదాములు, దుకాణాలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రేషన్కార్డుదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుండటంతో పక్కదారి పట్టకుండా, ఏ మేరకు సరఫరా చేస్తున్నారని ము మ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అవకతవకలు బయటపడిన పక్షంలో కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్లగొం డ జిల్లాలో అధికారులు ఆరు బృందాలుగా ఏర్ప డి తనిఖీలు చేపడుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఏ మేరకు నిల్వలు ఉన్నాయన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎంతమేరకు లబ్ధిదారులకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారన్న అంశంపై పూర్తిగా నిఘా ఉంచుతున్నారు. జిల్లాలో జిల్లాలో మొత్తం 17 మండలాలు, 428 గ్రామపంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 515 రేషన్దుకాణాలకు 2,18,903 రేషన్కార్డులు ఉన్నాయి. మూడు నెలలు బియ్యం పంపిణీకి 13,517.796 మెట్రిక్ టన్నులకు జిల్లాయంత్రాం గం ఇండెంట్ పెట్టింది. జిల్లాల్లోని రేషన్దుకాణాల్లో ఇప్పటికే రేషన్కార్డుదారులకు 50శాతం... మేరకు బియ్యాన్ని పంపిణీచేశారు. లబ్ధిదారులందరికీ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకునేందుకు పకడ్బందీగా ప్రభుత్వం నిఘాను ఏర్పాటు చేసింది.
గోదాముల పరిశీలన
సాధారణంగా రైస్ మిల్లుల నుంచి మొదట స్టేజ్-1 గోదాములకు, తర్వాత స్టేజ్-2 గోదాములకు, అక్కడినుంచి రేషన్దుకాణాలకు బియ్యం సరఫరా అవుతాయి. ఈక్రమంలో గోదాముల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేషన్ బియ్యం నిల్వ ఉండే గోదాములను తనిఖీలు చేపట్టి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టేజ్-1, స్టేజ్-2 గోదాముల్లో నిల్వలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎఫ్సీఐ నుంచి స్టేజ్-1 గోదాముకు వచ్చిన నిల్వలు ఎంత మేరకు ఉన్నాయని ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దుకాణాలకు సరఫరా చేయగా..., స్టేజ్-2 గోదాముల్లో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే పలు గోదాములను పరిశీలించారు. అయితే మరో విడతగా వారం రోజులు తనిఖీలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దొడ్డు బియ్యం నిల్వలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అప్పటికే గోదాములు, దుకాణాల్లో ఉన్న దొడ్డు బియ్యం నిల్వల మేరకు ప్రభుత్వం సన్న బియ్యాన్ని సరఫరా చేసింది. జూన్లో పంపిణీ పూర్తయితే సెప్టెంబరు వరకు రేషన్దుకాణాలు మూసి ఉంచుతారు. ఈ నేపథ్యంలో దొడ్డు బియ్యం పరిస్థితి ఏమిటనేది అధికారులు సందిగ్ధంలో పడ్డారు. పక్కదారి పట్టకుండా కట్టడి చేసే చర్యలో భాగంగానే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏయే రేషన్ దుకాణాల్లో నిల్వలు ఎంతమేరకు ఉన్నాయన్న సమాచారంపై ఆరా తీస్తున్నారు.
గడువు పొడిగించాల్సిందే..
ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో...దుకాణాల వద్ద లబ్ధిదారులు పెద్దఎత్తున క్యూలైన్ కడుతున్నారు. ప్రభుత్వం బియ్యం పంపిణీకి ఈ నెల 25వరకు గడువు విధించింది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 50 శాతానికి పైగానే బియ్యాన్ని అందజేశారు. ఒక్కో లబ్ధిదారుడు మూడుసార్లు బయోమెట్రిక్లో వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. కనీసం ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం పడుతుంది. ఈనెలాఖరు వరకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బియ్యం కూడా ఎప్పటికప్పుడు దుకాణాల్లో పంపిణీ జరుగుతుండటంతో ఎక్కడా కొరత లేకుండా చూడాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది.