Share News

ఫల రాజుకు కష్టాలు

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:20 AM

పండ్లలో రారాజు అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది మామిడి కాయ. మెరిసే ఎండలో రకరకాల రంగులతో కనువిందు చేసే మామి డి కాయల కోసమే వేసవి ఎపుడు వస్తుందా అంటూ ఎదురు చూసే వారు ఉన్నారంటే అతియోశక్తి కాదు. మార్కెట్లో ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడిదే అగ్ర స్థానం.

ఫల రాజుకు కష్టాలు

వేసవి వచ్చినా తగ్గిన మామిడి

ఐదేళ్లుగా తగ్గుతున్న దిగుబడులు

ప్రతికూల వాతావరణమే కారణం

(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ వ్యవసాయం): పండ్లలో రారాజు అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది మామిడి కాయ. మెరిసే ఎండలో రకరకాల రంగులతో కనువిందు చేసే మామి డి కాయల కోసమే వేసవి ఎపుడు వస్తుందా అంటూ ఎదురు చూసే వారు ఉన్నారంటే అతియోశక్తి కాదు. మార్కెట్లో ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడిదే అగ్ర స్థానం. అటువంటి రారాజుకే బండెడు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రతికూల వాతావర ణం మామిడి సాగుకు ప్రతిబంధకం గా మారింది. నడి వేసవి వచ్చినా మార్కెట్లో మామిడి కాయలు అంతగా కనిపించడం లేదు.

రాష్ట్రంలో మొత్తం 3లక్షల ఎకరాలు, ఉమ్మడి జిల్లాలో 24,584 ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగవుతోంది. సూర్యాపేట జిల్లాలో 11,460, యాదాద్రి జిల్లాలో 10,874, నల్లగొండ జిల్లాలో 2,250 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బంగినపల్లి రకం 95శాతం సాగవుతోంది. దశేరి, హిమాయత్‌, కేసరి, మల్లిక అనే రకాలను తినడానికి, జ్యూస్‌ రకాలు, చెరుకురసాలు, చిన్న, పెద్ద రసాలు, పచ్చళ్లకు జలాల్‌, నీలం, తెల్లగులాబి రకాలు సాగవుతున్నాయి.

ఈ ఏడాది గడ్డుకాలం

రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మామిడికి ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో పం డిన బంగినపల్లి మామిడిని బాద్‌షా అని పిలుస్తారు. ఈ ప్రాంతం నుంచే అధికంగా మామిడి అరబ్‌ దేశాలకు ఎగుమతి అవుతోం ది. ఉమ్మడి జిల్లాలో సైతం బంగినపల్లి అధికంగా సాగవుతోంది. ఈ ఏడాది ఆశించి న స్థాయిలో దిగుబడులు రాక రైతులు నష్టాలపాలయ్యారు. వేసవిలో సాధారణం గా మార్చి నెల వచ్చిందంటే మామిడి రాక మొదలవుతుంది. ఈ సారి మాత్రం ఏప్రిల్‌ నెల ముగుస్తున్నా ఆశించిన స్థాయిలో మా ర్కెట్లో ఈ పండ్లు కనిపించడం లేదు. ఈ ఏడాది మామిడికి గడ్డుకాలంగా నిలిచింది. మామిడిలో జనవరిలో పూత దశకు వస్తుం ది. ఈ సారి మాత్రం ఫిబ్రవరిలో పూత వచ్చింది. మార్చి వరకు మంచు కురవడం తో పూత దశలో తేనె మంచు పురుగు, బూడిద తెగులు కాయలకు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా మామిడిలో ఎకరానికి 5-6టన్నులు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది 2-3టన్నులకు మించి దిగుబడి రాలేదు. మామిడి యజమాన్యం లో సమస్యలు, నీటి కొరత, తోట లు సుమారు 20 ఏళ్ల క్రితం పెట్టినవి అధికంగా ఉండటంతో వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, అతి వేగం గా వీచే ఈదురు గాలులకు పిందె దశ నుంచి కాయ సైజ్‌కు వచ్చాక కూడా రాలిపోవడం, వాతావరణంలో మార్పులను సకాలంలో గుర్తించకపోవడం ప్రధాన సమస్యగా రైతులు పేర్కొంటున్నారు. దిగుబడులు లేక పెట్టిన పెట్టుబడులు చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధర లేక

ప్రతి ఏటా దిగుబడులు తగ్గుతు వస్తున్నాయి..అయినా మామిడికి మార్కెట్లో ధరలు పలకడంతో కొంత మేరకు రైతులకు గిట్టుబాటు అయింది.. ప్రస్తుతం మార్కెట్లో మామిడి కాయలు పెద్ద మొత్తంలో రాక పోయినా ధర లేకుండా పోయింది..పోయిన ఏడాది కిలో రూ.150ల వరకు ధర ఉండగా నేడు కాయలు పరిమాణాన్ని అనుసరించి వంద రూపాయలకు కిలోన్నర వరకు మామిడి కాయలు విక్రయిస్తున్నారు.. మామిడి గిరాకీ లేకపోవడంతో ధర పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కిలోకు రూ. 30-40 మాత్రమే గిట్టుబాటు కావడంతో మిగులు బాటు ఉండటం లేదని రైతులు చెపుతున్నారు.

ఐదేళ్లుగా మామిడి సాగులో సమస్యలు:నరేష్‌, ఉద్యానవన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా

మామిడి తోటల్లో ఐదేళ్లుగా దిగుబడులు పడిపోతున్నాయి. వాతావరణంలో సమూల మార్పులు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు, పూత ఆలస్యంగా రావడం, మంచు కురవడంతో తేనె మంచు పురుగు, బూడిద తెగులు ఆశించి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. చాలా వరకు తెగుళ్లను సకాలంలో గుర్తించి సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టకపోవడం, ముదురు తోటలు అధికంగా ఉండటంతో తెగుళ్లను సమర్థంగా తట్టుకోలేక దిగుబడులపై ప్రభావం పడుతోంది.

కాయలు చాలా ఆలస్యంగా వచ్చాయి: ఏనిక అనిల్‌కుమార్‌, వినియోగదారుడు, మిర్యాలగూడ

నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. వేసవి వచ్చిదంటే చాలు రకరకాల పండ్లు తినే వాడిని. ఏటా మార్చి వచ్చిందంటే కాయలు మార్కెట్లో కనిపించేవి. ఈ సారి కాయ చాలా ఆలస్యంగా ఏప్రిల్‌ మొదటి వారంలో అరకొరగా వచ్చాయి. కాయ పరిమాణం, నాణ్యతలో చాలా తేడాలు ఉన్నాయి. ధర లేకున్నా, రుచిలో తేడా ఉంది.

మామిడికి డిమాండ్‌ లేదు: షకీర్‌ మహ్మద్‌, వ్యాపారి, మిర్యాలగూడ

ఏటా వేసవి మొదలు జూన్‌ వరకు మామిడి కాయలకు చాలా డిమాండ్‌ ఉండేది. ఈ సారి మాత్రం ఏప్రిల్‌లో మార్కెట్‌కు కాయలు వచ్చాయి. గత ఏడాది మంచి కాయలకు కిలో రూ.150 వరకు ధర ఉంది. ప్రస్తుతం రూ.100కు కిలోన్నర వరకు విక్రయిస్తున్నాం. అయినా పెద్దగా గిరాకీ లేదు. రైతుల వద్ద నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తున్నాం. పెద్దగా నాణ్యత ఉండటం లేదు. ఎండలు అధికంగా ఉండటంతో మామిడి వినియోగం కూడా తగ్గింది.

Updated Date - Apr 24 , 2025 | 12:20 AM