సీసీ రోడ్లు వేశారు..మట్టి పోయడం మరిచారు
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:16 AM
గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లతో ప్రజలు నరక యాతనపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకుగాను ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
దశాబ్దం దాటినా పట్టించుకోని అధికారులు
తుర్కపల్లి, ఏఫ్రిల్ 17(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లతో ప్రజలు నరక యాతనపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకుగాను ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎస్డీఎఫ్, పంచాయతీరాజ్శాఖ, ఎనఆర్ఈజీఎ్స నిధులు ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో కాట్రాక్టర్లు సీసీ రోడ్లు వేస్తున్నారు కానీ ఆ రోడ్లకు ఇరువైపులా(రోడ్డు సైడ్ బర్ములకు) మొరం మట్టి పోయక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుర్కపల్లి మండలం ముల్కలపల్లి ఎస్సీ కాలనీ ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని గంగరాం తండా, జేతిరాం తండా, కీమ్యతండ, బోజ్యతండాలో సీసీ రోడ్లు చేపట్టేందుకుగాను 2014లో ఎనఆర్ఈజీఎ్స నిధుల ద్వార సుమారు రూ.30.50లక్షలు మంజూరు చేయగా ఆ నిర్మాణ పనులకు అప్పటి ఆలేరు ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి నేటి వరకు రోడ్డు సైడ్ బర్ములకు మొరం మట్టి పోయక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్భందులు పడుతున్నారు. భారీ వాహనాలు రోడ్డుపై వెళుతున్నప్పుడు రోడ్డుకు పగుళ్ల వచ్చి ధ్వంసమవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు ిఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లకు రోడ్డు బర్ములకు మొరం మట్టి పోయకపోవడంతో ప్రజలు ఇబ్భందులు పడుతున్నారు.
పదేళ్లుగా పట్టించుకోవడంలేదు
ముల్కలపల్లి గ్రామం నుంచి గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీకి వెళ్లేందుకు సుమారు మూడు వందల మీటర్ల దూరం దశాబ్దం క్రితం ఎనఆర్ఈజీఎ్స కింద సీసీ రోడ్డు వేశారు. రోడ్డుకు ఇరువైపులా మూడు మీటర్ల లో తు ఉంటుంది. రోడ్డు సైడ్ బర్ములకు మొరం మట్టి పోయక పోవడంతో రోడ్డు ఇరువైపులా కుంగిపోయి దెబ్బతిన్నది. మొరం మట్టి పోసి ప్రమాదాలు జరగకుండా చూడాలని 10 సంవత్సరాలుగా గ్రామ సభల్లో అధికారులు, ప్రజ్రాతినిధుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా పట్టింపు లేదు. అధికారులు స్పందించి రోడ్డుకు ఇరు వైపులా మట్టి పోసి ప్రమాదాలు జరగకుండా చూడాలి
-కోట బిక్షపతి, ముల్కలపల్లి(ఎస్సీ కాలనీ)
మట్టి పోసిన తర్వాతే ఎంబీ రికార్డ్ చేయాలి
గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు కానీ రోడ్డు సైడ్ బర్ములకు మొరం మట్టి పోయక పోవడంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్డు ఇళ్లకన్నా ఎత్తు కావడంతో రాత్రి వేళల్లో గ్రామస్థులు, వాహన దారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సబంధిత అధికారులు ఏ గ్రామంలోనైతే సీసీ రోడ్లు వేస్తారో ఆ గ్రామంలో పర్యటించి సీసీ రోడ్లకిరువైపులా మొరం మట్టి పోసిన తర్వాతే ఎంబీ రికార్డ్ చేసి కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వాలి.
- బానోత చతృనాయక్, తుర్కపల్లి
రోడ్డు సైడ్ బర్ములకు మట్టిని పోయిస్తాం
మండలంలోని ఆయా గ్రామాల్లో వేసిన పాత రోడ్లకు సంబంధించి రికార్డులను పరిశీలించి ఏ గ్రామంలోనైతే రోడ్లకిరువైపులా మట్టి పోయలేదో గుర్తించి, ప్రభుత్వానికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపుతాం. మండలంలో ఇటీవల వేసిన సీసీ రోడ్లకైతే ఇరువైపుల మట్టిని పోయిస్తున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రోడ్లకు సంబంధించి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మార్చి 31లోపు ఎంబీ రికార్డ్ చేసుకుని, ఆనలైనలో నమోదు చేసుకుని ఉంటే నిధులు ల్యాప్స్ కావు.
- చక్రధర్, పీఆర్ఏఈ, తుర్కపల్లి