Share News

జీవాల కాపరులను మింగిన బావి

ABN , Publish Date - May 10 , 2025 | 12:22 AM

వలస కుటుంబాల్లో విషాదం నెలకొంది. నీటి కోసం వెళ్లిన ఇద్దరు బావిలో పడి గల్లంతయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఆరు కుటుంబాలు గొర్రెలు మేపేందుకు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ప్రాంతానికి వచ్చారు.

జీవాల కాపరులను మింగిన బావి
అయోధ్య(ఫైల్‌ఫొటో)

బావిలో పడి ఇద్దరి మృతి

స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా

హుజూర్‌నగర్‌ , మే 9 (ఆంధ్రజ్యోతి) : వలస కుటుంబాల్లో విషాదం నెలకొంది. నీటి కోసం వెళ్లిన ఇద్దరు బావిలో పడి గల్లంతయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఆరు కుటుంబాలు గొర్రెలు మేపేందుకు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ప్రాంతానికి వచ్చారు. ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటకు చెందిన కన్మనూర్‌ తిరుపతయ్య, మేధిపురం లక్ష్మణ్‌తో పాటు మరో ఆరుగురు గొర్రెలను మేపుకునేందుకు రెండు నెలల క్రితం హుజూర్‌నగర్‌ ప్రాంతానికి వచ్చారు. కాగా పట్టణంలోని జక్కుల లింగయ్య పొలంలో మేత కోసం గొర్రెలను నిలిపి అక్కడే పొలంలో చెట్ల కింద ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో నాలుగు రోజుల క్రితం తిరుపతయ్య ఇద్దరు కుమారులు శేఖర్‌(14), చరణ్‌లు తండ్రి వద్దకు వచ్చారు. కాగా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తిరుపతయ్య పెద్దకుమారుడు శేఖర్‌, అదేవిధంగా మేధిపురం లక్ష్మణ్‌(21)లు పట్టణంలో తిరుపతమ్మ దేవాలయానికి సమీపంలోని జక్కుల లింగయ్య బావిలో నీళ్ల కోసం వెళ్లారు. లక్ష్మణ్‌ నీళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా కాలుజారి పడి మునగబోతుండగా శేఖర్‌ అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు.

ఆ క్రమంలో ఇద్దరు నీటిలో మునిగి చనిపోయినట్లు తండ్రి తిరుపతయ్య ఫిర్యాదుచేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ టీం సభ్యులు బయటికి తీశారు. అనంతరం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో సొంత గ్రామాలకు తీసుకువెళ్లారు.

పులిచింతల బ్యాంక్‌ వాటర్‌లో పడి పశువుల కాపరి...

మేళ్లచెర్వు, మే 9 (ఆంధ్రజ్యోతి) : చింతలపాలెం సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు బ్యాంక్‌ వాటర్‌లో పడి పశువుల కాపరి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం తమ్మారం గ్రామానికి చెందిన సూరగాని పిచ్చయ్యకు చెందిన గేదెలు పులిచింతల బ్యాంక్‌ వాటర్‌ మధ్యలో ఉన్న పాయ(చిన్న ద్వీపం) మేతకు వెళ్లాయి. వాటిని తోడుకొచ్చేందుకు పిచ్చయ్య కుమారుడు అయోధ్య(19) పాయల మధ్యకు ప్రతి రోజూ చిన్నపడవతో వెళ్లి వస్తుంటారు. అయోఽధ్య గురువారం ఈతకొట్టుకుంటూ వెళ్లగా ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి స్థానిక మత్స్యకారులు మృతదేహాన్ని వెలికితీశారు. కాగా అయోధ్య తండ్రి పిచ్చయ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తిచేసి శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా అయోధ్య పదో తరగతి వరకు చదివాడు. వ్యవసాయంలో తండ్రికి చేదోడు, వాదోడుగా ఉంటున్నాడు. యువకుడికి తల్లితో పాటు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

పులిచింతల బ్యాంక్‌ వాటర్‌లో వరుస ప్రమాదాలు

పులిచింతల బ్యాంక్‌ వాటర్‌లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు సమన్వయం లోపంతో ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గురువారం అయోధ్య మరణించగా

వారం కిందట చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి కొమ్ము లోకేష్‌ నదిలో ఈతకు వెళ్లి మునిగి చనిపోయాడు. కాగా వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు జరగటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కృష్ణానదిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి ఈతకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 10 , 2025 | 12:22 AM