మరో అడుగు పెరిగిన మూసీ నీటిమట్టం
ABN , Publish Date - May 22 , 2025 | 12:16 AM
కేతేపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం మరో అడుగు పెరిగి 636.10 అడుగులకు చేరింది.
కేతేపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం మరో అడుగు పెరిగి 636.10 అడుగులకు చేరింది. 645అడుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు గత యాసంగి సీజన్లో ఆయకట్టులోని భూముల్లో పంట సాగుకు నీటిని అందించి పంటకాలం ముగిసి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల నిలిపి(గత నెల 6) వేసే నాటికి నీటిమట్టం 622 అడుగులకు పడిపోయింది. ఆ తర్వాత ఎగువ మూసీ పరివాహక ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుంది. 48రోజులుగా ఎగువ నుంచి నిలకడగా, నిరంతరాయంగా వస్తున్న ఇన్ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం వేసవిలో సైతం ఒక్కో అడుగు పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం 635అడుగులుగా నమోదైన ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి మరో అడుగు మేర పెరిగి 636.10అడుగులుగా నమోదైంది. ఎగువ నుంచి 634క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది. వేసవిలోనే ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.