చల్లగా ఉండాలని..
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:12 AM
వేసవిలో ఎండలకు గొంతు తడారిపోతుంటుంది. రహదారిపై ప్రయాణంతో మరింతగా దాహంతో అల్లాడుతుంటారు.
(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
వేసవిలో ఎండలకు గొంతు తడారిపోతుంటుంది. రహదారిపై ప్రయాణంతో మరింతగా దాహంతో అల్లాడుతుంటారు. చల్లని నీరు దొరికితే చాలనుకుంటాం. అనుకోకుండా అల్లం, జీలకర్ర వేసిన చల్లని మజ్జిగ గ్లాసు చేతికందితే అప్పటిదాకా అనుభవించిన వేసవితాపం క్షణంలో చల్లార్చవచ్చు. గ్లాసుపైన గ్లాసు కడుపునిండేంత చల్ల దొరికితే అంతటి మహాభాగ్యం ఉంటుందా. అలాంటి సేవలో కొన్నేళ్లుగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శెట్టిపాలెం రోడ్డులో వేణుగోపాల ఫిల్లింగ్ స్టేషన నిర్వాహకులు కొన సాగుతున్నారు. హిందుస్థాన పెట్రోల్బంక్లో వాహనదారులకు, ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. మొక్కుబడిగా కాకుండా రోజుకు 20కిలోల పెరుగులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూదీనా కలిపి మజ్జిగ చేసి పెట్రోల్బంకులోకి వచ్చిన ప్రతిఒక్కరికీ పంపిణీ చేస్తున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేస్తూ అందరి కడుపులను చల్ల బరుస్తున్నారు. ఇందుకోసం అదనంగా ముగ్గురు సిబ్బందిని నియమించారు. ప్రతి వేసవిలోనూ మార్చి నుంచి ఎండలు తగ్గేవరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 10ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
సేవా కార్యక్రమంగా భావిస్తున్నా
మనం బతుకుతూ ఇతరులకు కొంత సేవచేయాలి. ఎండల్లో ప్రయాణికులు వడదెబ్బకు గురికాకుండా ఉదయం నుంచి సాయంత్రవరకు వచ్చిన వారికి తాగినంతగా మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. దీంతో నాకు చల్ల వెంకటేశ్వర్లు అనే పేరుకూడా వచ్చింది. కరోనా రెండేళ్ల సమయంలో తప్ప పదేళ్లుగా బంక్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నా. ముగ్గురు అదనపు సిబ్బందిని నియమించి పంపిణీ చేయిస్తున్నాం. రోజుకు రూ.3 వేల వరకు ఖర్చు వస్తుంది. తోటివారికి సేవ చేస్తునన్న సంతృప్తి మిగులుతోంది.
దేవులపల్లి వెంకటేశ్వర్లు, పెట్రోల్బంక్ నిర్వాహకులు