యాదగిరిక్షేత్రంలో నేటినుంచి శ్రావణ సందడి
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:00 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి శ్రావణ సందడి ప్రారంభం కానుంది.
సత్యదేవుని వ్రత టికెట్ ధర రూ.200పెంపు
యాదగిరిగుట్ట, జూలై 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి శ్రావణ సందడి ప్రారంభం కానుంది. శుక్రవారం, శ్రావణమాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కావడంతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ప్రత్యేకంగా సత్యనారాయణస్వామి, వరలక్ష్మీ వ్రతాలు ఆచరించేందు కు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. కొండకింద వ్ర త మండపంలో వేర్వేరుగా రెండు హాళ్లలో 500మంది ఒకేసారి వ్రతంలో పాల్గొనవచ్చు. నాలుగు విడతల్లో (ఉదయం 7.30, 10.00, మధ్యాహ్నం 12.00, సాయంత్రం 4.00గంటలు) నిర్వహించే వ్రతాలకు ఇప్పటివరకు రుసుము రూ.800 వసూలు చేస్తుండగా, రూ.200 పెంచారు. గతంలో రూ.800 టికెట్టుతో ఆరు కొబ్బరికాయలు, 260 గ్రాముల చక్కెర, 250 గ్రాముల గోధుమరవ్వ, 200 గ్రాముల బియ్యం, 21 పోకలు, తమలపాకులు, ఐదు ఖర్జూరలు, 15 గ్రాముల కుంకుమ, పసుపు, 20 గ్రాముల బుక్కగులాల్, 10 గ్రాముల గులాల్, కాజు, కిస్మిస్లు, దూది, 20/20 తెల్ల వస్త్రం, ఒక కుడుక, 20గ్రాముల నూనె, ఐదు గ్రాముల తేనె, 50 గ్రాముల నెయ్యి, పంచామృతం, జాకెట్ ముక్క అందిస్తున్నారు. అదనంగా రూ.200 పెంచటంతో పాటు దంపతులకు అదనంగా శెల్ల(ఉత్తరీయం), లక్ష్మీనారసింహులు, సత్యదేవుని ప్రతిమలు అందించనున్నారు.
నేడు టికెట్ కౌంటర్ ప్రారంభం
స్వామివారి భక్తుల సౌకర్యార్థం కొండపైన ప్రసాద టికెట్ల కౌంటర్ను శుక్రవారం ప్రారంభించనున్నారు. గతంలో టికెట్లు, ప్రసాదాలు పొందేందుకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. శివాలయం ఎదురుగా కౌంటర్లో టికెట్ తీసుకుని ప్రసాదాల కోసం 50 మెట్లెక్కి దిగాల్సి వస్తోంది. భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రధానాలయ ఈశాన్య దిశలో(తిరువీధుల్లో) అఖండ దీపారాధన పక్కన ప్రసాద టికెట్ల కౌంటర్ను ఏర్పాటుచేసినట్లు ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు తెలిపారు. రద్దీ ఉన్న సమయంలో శివాలయం ఎదురుగా ఉన్న కౌంటర్లోనూ టికెట్లు ఇస్తామన్నారు.
యాదగిరీశుడికి శాసో్త్రక్తంగా నిత్య పూజలు
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. విష్వక్సేనుడి తొలిపూజలతో క ల్యాణతంతు కొనసాగింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేషవసా్త్రలు, ఆశీర్వచనం అందజేశారు. ముందుగా సుదర్శన శతక పఠనంతో హోమం పూజలు నిర్వహించారు. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు, యాగశాలలో నిత్య రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.9,38,408 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు.