గడువు తీరిన ఎరువుల విక్రయాలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:38 PM
గడువు తీరిన ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తున్న దుకాణంపై విజిలెన్స ఎనఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించి రూ.2లక్షల విలువైన ఎరువులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.2లక్షల విలువైన ఎరువులు స్వాధీనం
విజిలెన్స, ఎనఫోర్స్మెంట్ అధికారుల సోదాలు
మిర్యాలగూడ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గడువు తీరిన ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తున్న దుకాణంపై విజిలెన్స ఎనఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించి రూ.2లక్షల విలువైన ఎరువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ సంఘటన జరిగింది.పట్టణ శివారులోని నందిపాడు, రవీంద్రగర్ పురుగుల మందులు విక్రయిస్తున్న లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, మిర్యాలగూడ రైతు ఆగ్రో సేవాకేంద్రంపై ఫిర్యాదులు అందడంతో మండల వ్యవసాయ అధికారి, విజిలెన్స, ఎనఫోర్స్మెంట్ శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. లక్ష్మీ వెంకటేశ్వర దుకాణంలో సుమారు రూ. 11వేలు, ఆగ్రోసేవా కేంద్రంలో రూ.1.86లక్షల విలువైన గడువు తీరిన మందులను స్వాధీనం చేసుకున్నారు. స్టాక్ రిజిస్టర్లో వీటిని నమోదు చేయకపోవడంపై రెండు దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఉదయం సమయంలో ఎరువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులతో విజిలెన్స, ఎనఫోర్స్మెంట్ అధికారులు మాట్లాడుతూ బలవంతంగా ఎరువులు విక్రయిస్తున్నారా అంటూ ప్రశ్నించగా, తక్కువ ధరకు ఎవరు విక్రయిస్తే అక్కడే కొనుగోలు చేస్తున్నామని వారు సమాధానమిచ్చారు. తనిఖీల్లో విజిలెన్స, ఎనఫోర్స్మెంట్ సీఐ ఎస్కే.గౌస్, కానిస్టేబుల్ నరసింహ, ఏఈవో షఫీ, మండల వ్యవసాయ అధికారి సైదానాయక్ పాల్గొన్నారు.