సాగర్కు భారీగా వరద
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:41 AM
నాగార్జునసాగర్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువనుంచి 4,85,472 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు)కాగా బుధవారం సాయంత్రానికి 583.70 అడుగులుగా (293.6854టీఎంసీలు) నమోదైంది. సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా 8,023 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6,022 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32,805 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, 26 గేట్ల నుంచి 4,28,834 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 4,78,384 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువనుంచి 4,85,872 క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరుతోంది,
ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక 4 లక్షల పైచిలుకు వస్తుండడంతో దిగువ కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హె చ్చరిక జారీ చేశారు, మత్స్యకారులు ఎవరూ నదిలోకి వేటకు వెళ్లవద్దని అలాగే పశువుల కాపరులు నదిలోకి తమ పశువులను దింపవద్దని, పశువుల కాపరులు నదిలో దిగవద్దని సూచించారు.
మూసీకి కొనసాగుతున్న వరద ఉధృతి
8 క్రస్టుగేట్లు ఎత్తి వరద నీటి విడుదల
కేతేపల్లి : హైదరాబాద్ నగరంతో పాటు ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ రిజర్వాయర్కు వరద నీటిరాకడ కొనసాగుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 13రోజులుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీకి బుధవారం 8059.56 క్యూసెక్కులుగా ఇన్ఫ్లో నమోదైంది. మరోవె ౖపు ప్రాజెక్టు నీటిమట్టం 642.37 అడుగులకు పడిపోయింది. అయినా ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగే వీలున్న నేపథ్యంలో డ్యాం ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు 2, 3, 4, 5, 6, 7, నెంబరు క్రస్టుగేట్లను 2 అడుగులు, 10 నెంబరు క్రస్టుగేటును 1 అడుగు మొత్తం 8 క్రస్టుగేట్ల ద్వారా 9385.42 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు 117.09 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. 645 అడుగులు (4.46 టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 642.37అడుగులు (3.78టీఎంసీలు)గా ఉంది.