ముద్దుగుమ్మల కోసం ముస్తాబు
ABN , Publish Date - May 10 , 2025 | 12:16 AM
రాష్ట్ర ప్రభుత్వం మిస్వరల్డ్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి సుందరీమణులు తరలిరానున్నారు. శనివారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి.

యాదగిరిగుట్ట, పోచంపల్లిలో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ నెల 15న రానున్న మిస్వరల్డ్ పోటీదారులు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): రాష్ట్ర ప్రభుత్వం మిస్వరల్డ్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి సుందరీమణులు తరలిరానున్నారు. శనివారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం తెలంగాణలోని సాంస్కృతిక వైభవాన్ని, వైవిద్యాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి చూపించాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 15న జిల్లాలో పర్యటించేందుకు టూరిజం శాఖ సన్నాహాలు చేసింది. ఈమేరకు ప్రపంచ అందగత్తెలు రాష్ట్రంలోని ఏఏ ప్రాంతాలను సందర్శించాలన్న కార్యక్రమాల వివరాలను అధికారికంగా నిర్ణయించారు.
మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వారు సందర్శించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భదత్రతోపాటు ప్రొటోకాల్పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు కార్యక్రమ నిర్వహణపై నేరుగా సమీక్షలు నిర్వహి స్తూ, ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శులు జయే్షరంజన్, స్మితాసబర్వాల్, డైరెక్టర్ హనుమంతు కే.జెండగే, కలెక్టర్ ఎం.హనుమంతరావు, టూరిజం శాఖలోని పలువురు రాష్ట్రస్థాయి అధికారులు నిత్యం భూదాన్పోచంపల్లిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆలయ ఈవోగా కొనసాగుతున్నారు. పోటీదారుల పర్యటనపై ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారు స్వామివారిని దర్శించుకునేందుకు రానుండగా, ఆలయ సంప్రదాయాలను పకడ్బంధీగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ మాడవీధల్లో రెడ్కార్పెట్ను ఏర్పాటుచేయడంతోపాటు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఎండలు విపరీతంగా మండుతుండటంతో సాయంత్రం వేళలో ఆలయాన్ని సందర్శించనున్నారు. అదేవిధంగా ప్రపంచ గుర్తింపు పొందిన మరో ప్రాంతమైన భూదాన్పోచంపల్లిలో మిస్వరల్డ్ పోటీదారులు పర్యటించనున్నారు. ఇక్కడ తయారైన చీరలు దేశ, విదేశాల్లో బహుళ ప్రాచుర్యం పొందాయి. భూదాన్పోచంపల్లి అనగానే మగువలు మెచ్చే పట్టుచీరలకు నిలయం. ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో గుర్తించిన భూదాన్పోచంపల్లిని సుందరీమణులు సందర్శించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సంప్రదాయ చీరకట్టులో కళాత్మకంగా నేసిన చీరలను ధరించనున్నారు. భూదాన్పోచంపల్లిలో టైఅండ్డై ఇక్కత్ పట్టుచీరల తయారీ కేంద్రాలను పరిశీలించనున్నారు. ఈనేపథ్యంలో అందెగత్తెలరాక సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంతోపాటు భూదాన్పోచంపల్లిలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించిన అనంతరం భూదాన్పోచంపల్లికి వెళ్లనున్నారు. మొత్తం జిల్లాలో రెండు గంటలపాటు పర్యటన ఉండనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.