నత్తనడకన ఆధునికీకరణ
ABN , Publish Date - May 24 , 2025 | 12:07 AM
మూసీ కాల్వలను బలోపేతం చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలనే లక్ష్యం నీరుగారుతోంది. రూ.కోట్లు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి-భానుపురి)
మూసీ కాల్వలను బలోపేతం చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలనే లక్ష్యం నీరుగారుతోంది. రూ.కోట్లు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. కాల్వలకు ఆధునికీకరణ పనులు చేయడానికి 2017-18లో రూ.65 కోట్లు కేటాయించి టెండర్లు ద్వారా గుత్తేదారుకు అప్పగించారు. 33 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, కాల్వలు సరిగా లేకపోవడంతో నీరు చివరకు చేరడం లేదని ఆయకట్టును తగ్గించారు. కుడి, ఎడమ కాల్వల పరిధిలోని 15 వేల ఎకరాల చొప్పున నీటిని ప్రస్తుతం అందిస్తున్నారు. ఎడమ కాల్వ వైపు సూర్యాపేట పట్టణం రోజురోజుకు విస్తరించడం, ఆయకట్టు విస్తీర్ణం తగ్గింది. చివరి ఆయకట్టు భూములకు నీటిని అందించాలని ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం రూ.65 కోట్లు కేటాయించింది. పనులు చేపట్టి ఆరు ఏళ్లు దాటినా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. గుత్తేదారు బీట్(పనులను) వారీగా ఉప గుత్తేదారులకు అప్పగించుకుంటూ వస్తున్నారు. అధికారులు సరిగ్గా పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఉపగుత్తేదారులు సక్రమంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూసీ ప్రాజెక్టు 645 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. అయితే మూసీ కాల్వల పనులు చేపట్టినప్పటి నుంచి ఎగువ ప్రాంతంలో వర్షాలు పడడం, గుత్తేదారులకు ఇతర చోట్ల పనులు ఉండడం, బిల్లులు సకాలంలో రావడం లేదని నిర్లక్ష్యం చేయడంతో పనులు పూర్తి కాలేదు. మూసీ కుడి కాల్వ పనులు 80 శాతం పూర్తి కాగా ఎడమ కాల్వ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ఎడమ కాల్వలో కట్టలను వెడల్పు చేయడం, తూముల పనులు, కాల్వలకు అడ్డంగా ఉన్న కంపచెట్లను ఇంకా కొన్నిచోట్ల తొలగించలేదు. 637 అడుగుల నీరు నిల్వ ఉన్న ప్రాజెక్టులో 7 అడుగుల నీరు వస్తే నిండుకుండలా ఉంటుంది. వర్షాలు ఎగువ ప్రాంతంలో పడితే ప్రాజెక్టు నుంచి మూసీ నదిలోకి, కాల్వలకు వదలాల్సి వస్తోంది. కాల్వలకు నీటిని వదిలితే పనులు చేయడానికి అనుకూలించే పరిస్థితి ఉండదు. ఒక్కసారి నీటిని వదిలితే 15 రోజుల వరకు నీరు నిల్వ ఉంటోంది. ఇప్పటివరకు నాణ్యతా ప్రమాణాలతో చేయని పనులు, కట్టలపై పిచ్చిమొక్కలు మొలిచి అధ్వానంగా కనిపిస్తున్నాయి. మూసీ కాల్వలు పనులు పూర్తయితే కుడి కాల్వ ద్వారా కేతేపల్లి, నకిరేకల్, మాడ్గులపల్లి, తిప్పర్తి, వేములపల్లి మండలాల్లోని ఆయకట్టుకు సుమారు 40 కిలోమీటర్ల దూరం నీరు వెళ్లాల్సి ఉంది. ఎడమకాల్వ వైపు సూర్యాపేట, చివ్వెంల, పెనపహాడ్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఆయకట్టు సస్యశ్యామలమవుతోంది. ఎడమ కాల్వ 42 కిలోమీటర్ల దూరం నీరు విస్తరించి ఉంది. ఆరేళ్ల నుంచి మూసీ ప్రాజెక్టులో నీరు 630 అడుగుల నీరు ఉంటుండగా వానాకాలం, యాసంగి పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. పనులు చేయడానికి కేవలం రెండు నెలలు మాత్రమే అనుకూలంగా ఉంటోందని మూసీ అధికారులు చెబుతున్నారు. ఎడమకాల్వ పరిధిలోని యండ్లపల్లి, పిన్నాయిపాలెం, ఇమాంపేట ప్రాంతాల్లో ఆధునికీకర ణ పనులు చేయాల్సి ఉంది. బ్యాకింగ్ పనులు అక్కడక్కడ పూర్తి చేసినా ఇంకా పనులు చేయా ల్సి ఉంది. ఇమాంపేట వైపు ఉన్న కాల్వకు చుట్టూ కంపచెట్లను సైతం తొలగించలేదు. తూ ములు ఏర్పాటు చేయడానికి మాత్రం ఎక్సకవేటర్లతో గుంతలు తీశారు.
తూముల పనులు అసంపూర్తి
కుడి కాల్వ వైపు 30 కిలోమీటర్ల మేర కాల్వ పనులను పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 40 తూములకు పనులు చేయాల్సి ఉండగా 25 పూర్తి చేసినట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల కట్టలను వెడల్పు చేయాల్సి ఉంది. ఎడమ కాల్వ వైపు 14 కిలోమీటర్ల వరకు పను లు పూర్తిచేశారు. దురాజ్పల్లి వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయంటున్నారు. ఇంకా 5 కిలోమీటర్ల వరకు పనులు చేయాల్సి ఉంది. జీఎ్సటీ పెరగడంతో నిధులు సరిపోవడం లేదని మరో 8 కిలోమీటర్ల పనులు చేయడానికి నిధులు కావాలని అధికారులు అంటున్నారు. 22తూములు ఉండగా 2 తూముల పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 20 తూముల పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్లు నత్తనడకన పనులను కొనసాగిస్తున్నారు.
సెప్టెంబరు వరకు గడువు ఉంది
కుడి కాల్వ 90శాతం లైనింగ్ పనులు చేశాం. ఎడమ కాల్వ వైపు 70 శాతం లైనింగ్ పనులు పూర్తి చేశాం. మిగతా పనులు చేస్తున్నారు. సెప్టెంబరు వరకు గడువు ఉంది. ఎడమ కాల్వ వైపు మాత్రమే 30 శాతం పనులు చేయాల్సి ఉంది. త్వరలోనే పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించాం. నీరు కాల్వల్లో నిల్వ ఉండడంతో పనులు పూర్తి చేయలేకపోతున్నాం.
- చంద్రశేఖర్, మూసీ డీఈ, సూర్యాపేట