ఖజానాకు కిక్
ABN , Publish Date - May 19 , 2025 | 12:15 AM
సూర్యాపేట క్రైం, మే 18 (ఆంధ్రజ్యోతి) : మద్యం ధరల పెంపుతో ఖాజానాకు ఆదాయం పెరగనుంది. మూడు నెలల క్రితం బీర్ల ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా విస్కీ ధరలను కూడా పెంచింది.
పెరిగిన మద్యం ధరలు
విస్కీపై ఫుల్బాటిల్పై రూ.40 పెంపు
అదనపు భారం రూ.5.42 కోట్లు
నేటి నుంచి కొత్త ధరలు
సూర్యాపేట క్రైం, మే 18 (ఆంధ్రజ్యోతి) : మద్యం ధరల పెంపుతో ఖాజానాకు ఆదాయం పెరగనుంది. మూడు నెలల క్రితం బీర్ల ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా విస్కీ ధరలను కూడా పెంచింది. సాధారణ రోజుల్లో మద్యం తాగినప్పటికీ వేసవిలో మాత్రం బీర్లు తాగి వేసవి తాపం నుంచి కొంతమేర తాత్కాలిక ఉపశమనం పొందుతుంటారు. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. తాజాగా మద్యం(విస్కీ) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ బాటిల్ విస్కీ ధర రూ.40 వరకు పెరిగింది. అన్ని కంపెనీలకు సంబంధించిన విస్కీపై ప్రభుత్వం క్వాటర్కు రూ.10, హాఫ్బాటిల్కు రూ.20, ఫుల్ బాటిల్కు రూ.40చొప్పున పెంచింది. ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
జిల్లాలో 99 వైన్సలు,
20 బార్ అండ్ రెస్టారెంట్లు
జిల్లా పరిధిలో 99 మద్యం దుకాణాలు, 20 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ప్రతీ ఏడాది సుమారు 1.13లక్షల వివిధ కంపెనీలకు చెందిన కాటన్ల విస్కీ, 1.30లక్షల కాటన్ల బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మూడు నెలల క్రితం బీర్ల ధరల పెంపుతో బీరు ప్రియులపై ఆర్థికభారం పడింది. ఒక్కో బీరుపై 15శాతం ధర పెంచింది. దీంతో బీరుపై రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. దీంతో ఏడాదిలో పెరిగిన బీర్ల ధరతో మందుప్రియులపై అదనంగా రూ.4.68కోట్ల అదనపు భారం పడింది. తాజాగా మద్యం ధరలు పెంచడంతో మద్యం ప్రియులపై ఇంకా అదనపు భారం పడనుంది. ప్రభుత్వం పెంచిన మద్యం ధరలతో జిల్లాలో మద్యం ప్రియులపై ఏడాదికి సుమారు రూ.5.42కోట్ల భారం పడనుంది. ఇదిలా ఉండగా ప్రతీ 90 ఎంఎల్ మద్యంపై ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా రూ.10 పెంచారు.
అమల్లోకి నూతన ధరలు
ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు అమలులోకి రానున్నాయి. ఇప్పటికే మద్యం డిపోల్లో ఉన్న పాత స్టాక్ను కూడా పెంచిన ధరల ప్రకారం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మద్యం దుకాణాలకు కూడా మద్యం బాటిళ్లపై పాత ఎంఆర్పీ ధర ఉన్నప్పటికీ వారి నుంచి ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో పాత స్టాక్ను కూడా నూతన ధరలకు విక్రయించాలని ఆదేశించింది.
పెరిగిన ధరల ప్రకారం విక్రయించాలి
ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం మద్యం విక్రయించాలి. పాత స్టాక్ను కూడా నూతన ధరలకు విక్రయించాలి. ఎవరైనా మద్యాన్ని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. బీరు బాటిళ్లపై ప్రస్తుతం కొనసాగుతున్న ధరల ప్రకారం విక్రయాలు జరుగుతాయి.
-లక్ష్మానాయక్, ఈఎస్ సూర్యాపేట
పెరిగిన ధరల ప్రకారం
బ్రాండ్ ధర
100పైపర్స్ రూ.2160
బ్లాక్ అండ్ వైట్ రూ.2080
బ్లాక్డాగ్ రూ.2160
టీచర్స్ రూ.2320
బ్లెండర్స్ప్రైడ్ రూ.1360
సిగ్నేచర్ రూ.1360
రాయల్స్టాగ్ రూ.880
ఇంపీరియల్ బ్లూ రూ.760
ఆఫీసర్స్ ఛాయిస్ రూ.660