వినూత్నం.. మత్తు వదిలించడమే లక్ష్యం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:23 AM
మత్తుకు బానిసలై జీవితాలను దెబ్బతీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో మార్పు రావాలని మత్తుకు బానిసలు కావద్దని, వాటితో అనేక అనర్థాలు ఉన్నాయని తెలిపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.
జనసమూహం వద్ద మత్తు పదార్థాల అనర్థాలపై ప్రచారం
ప్రత్యేక అలంకరణతో ప్రజలను అవగాహన కల్పించే ప్రయత్నం
మత్తుకు బానిసలై జీవితాలను దెబ్బతీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో మార్పు రావాలని మత్తుకు బానిసలు కావద్దని, వాటితో అనేక అనర్థాలు ఉన్నాయని తెలిపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ధూమపానికి బానిసై ఆరోగ్యం క్షీణించి మృతి చెందిన తన మిత్రుడిలా మరెవరూ కావద్దని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంటోంది. మత్తును అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ మాత్రం ఒక అడుగు ముందుకేసి మత్తు పదార్థాల నిర్మూలనకు తనవంతుగా కృషి చేస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మం డలం తడకమళ్ల గ్రామానికి చెందిన ప్రభాకర్ ప్రస్తుతం సూర్యాపేటలో ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరె ంట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎవరో ఏదో అనుకుంటారని అనుకోకుండా తనద్వారా మత్తు పదార్థాలు వాడే వారిలో కొంతైనా మార్పు వస్తే చాలనుకున్నాడు.
నల్లని చొక్కా, పుర్రెల దండ...
ప్రభాకర్ తన ప్రచారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. చెప్పే విషయం అందరికీ తెలిసిందే కావడంతో విషయం పట్ల ఆకర్షణ కోసం వినూత్నంగా సిద్ధమవుతారు. నల్లని చొక్కా, దానిపై నో డ్రగ్స్, సేవ్ లైవ్ స్లోగన, మెడలో పుర్రెలతో కూడిన దండ, చేతిలో మైక్, నెత్తిన టోపీ, కళ్లజోడు పెట్టుకుని ప్రజలు గుమిగూడే ప్రదేశాలకు వెళ్తాడు. మత్తు పదార్థాలతో అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తాడు. సొంతంగా కరపత్రాలను ముందింపజేసి వాటిని పంపిణీ చేస్తుంటారు. సూర్యాపేట పట్టణంతో పాటు సమీప మండలాల్లోని గ్రామాలు, ఇతర జిల్లాల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మత్తు పదర్థాల నిర్మూలనకు తనవంతుగా కృషి చేస్తున్నారు.
కలచివేసిన మిత్రుడి మృతి
ఖమ్మంలో టీటీసీ కోర్సును అభ్యసించే సమయంలో తోటి మిత్రుడు ఒకరు ధూమపానానికి బానిసయ్యాడు. దాంతో ఆరోగ్యం చెడిపోతుందని చెప్పినా పట్టించుకోకపోవడంతో అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. మిత్రుడి మృతితో తీవ్రంగా కలతచెందిన ప్రభాకర్ తన మిత్రుడి మాదిరిగా సమాజంలో మత్తుతో మరెవరు మృతి చెందవద్దని భావించాడు. అందుకోసం తనవంతుగా కొందరిలోనైనా మార్పు వస్తుందని గ్రహించి తనవంతుగా వినూత్నంగా మత్తు పదార్థాలపై ప్రచారం చేస్తున్నారు.
మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు
మత్తు పదార్థాల వినియోగం ఇటీవల పెరిగింది. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు, యువత అలవాటు పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తే కొందరిలోనైనా మార్పు వస్తుందనే నమ్మకం. కొన్ని నెలలుగా జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ తీరిక సమయంలో అవగాహన కల్పిస్తున్నా.
రాచకొండ ప్రభాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు