యథేచ్ఛగా నకిలీ మద్యం దందా
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:54 AM
జిల్లాలో నకిలీ మద్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు ముందు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ దందా సాగుతోంది. ఇటీవల మేళ్లచెర్వు మండలంలో నకిలీ మద్యం కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేయడంతో మరోసారి దందా విషయం వెలుగుచూసింది.
జిల్లాలో నకిలీ మద్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు ముందు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ దందా సాగుతోంది. ఇటీవల మేళ్లచెర్వు మండలంలో నకిలీ మద్యం కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేయడంతో మరోసారి దందా విషయం వెలుగుచూసింది. నకిలీ మద్యం కేసుకు సంబంధించి మేళ్లచెర్వులోని శివపార్వతి వైన్స్ను సీజ్ చేశారు. దొండపాడులోని మరో వైన్షాపుపై చర్యలకు సిద్ధమవుతున్నారు. దీంతో మందు ప్రియులు ఏది అసలో, ఏది నకిలీనో తెలియక ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి-హుజూర్నగర్/ మేళ్లచెర్వు)
మేళ్లచెర్వు మండలం రామాపురం కేంద్రంగా జిల్లాలో నకిలీ మద్యం దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టాస్క్ఫోర్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతంలో నకిలీ దందా బట్టబయలైంది. ఈ క్రమంలో రాష్ట్ర టాస్క్ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై మేళ్లచెర్వు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఈ నెల 21న దాడి చేశారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి రైస్మిల్లు గోదాంలో నకిలీ మద్యం తయారీ కోసం నిల్వ చేసి 600లీటర్ల స్పిరిట్, 240 ఖాళీ బాటిళ్ళు, 37 కాటన్ల ఓ ప్రముఖ కంపెనీ విస్కీ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు లేబుళ్లు, స్టిక్కర్లు సీజ్ చేశారు. సుమారు రూ.20 లక్షల విలువైన నకిలీ విస్కీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోదాం యజమాని సూర్యప్రకాశ్రావు, పల్నాడు జిల్లా దుర్గికి చెందిన శ్రీరామ్ మహే్షలను ఆ రోజే అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు రామాపురం గ్రామానికి చెందిన నకిలీ మద్యం తయారీదారుడు తోట శివశంకర్ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరిచ్చిన సమాచారంతో టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు రామాపురం గ్రామంలో కె.సైదేశ్వరరావు(సైదీ) పొలంలో అక్రమంగా నిల్వ చేసిన నకిలీ మద్యాన్ని ఎక్స్కవేటర్తో తవ్వకాలు చేపట్టి స్వాధీనం చేసుకున్నారు.
నాయకుడిని నమ్మించి...
స్థానిక సంస్థల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని నాయకులను లక్ష్యంగా చేసుకుని ముందస్తుగా వారి నుంచి డబ్బులు తీసుకుని నకిలీ మద్యాన్ని అంటగుడుతున్నట్లు సమాచారం. ఇందులో మద్యం దుకాణాల్లో పనిచేసే ఇద్దరితో పాటు మరికొందరు కలిసే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ నాయకుడికి శివశంకర్, సైదేశ్వరరావు కలిసి రూ.6 లక్షల నకిలీ మద్యాన్ని తయారుచేసి అంటగట్టాడు. ఆ మద్యాన్ని తెలియక కొనుగోలు చేసిన నాయకుడు అధికారుల దాడుల నేపథ్యంలో భయంతో సైదీ పొలంలో భూమిలో సుమారు 133 ఎంసీ విస్కీ కాటన్లు పాతిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు భూమిలో పాతి పెట్టిన నకిలీ మద్యంలో సగం మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మద్యం తీయడానికి సాధ్యం కాకపోవడంతో ఎక్స్కవేటర్తో ద్వంసం చేసి పూడ్చివేశారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. ఇందులో దొండపాడు హిమాలయ వైన్స్లో పనిచేస్తున్న ప్రవీణ్, మేళ్లచెర్వు శివపార్వతి వైన్స్లో పనిచేస్తున్న తోట శివశంకర్లు నిందితులుగా ఉండడం గమనార్హం. వీరిద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. శివపార్వతి వైన్స్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గతంలో పాలకవీడు మండలంలో నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వైన్షాపు వెనుక ఒక గదిలో నకిలీ మద్యం తయారుచేస్తుండగా స్థానికుల సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా వేపలమాదారంలోనూ నకిలీ మద్యం తయారీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. నకిలీ మద్యాన్ని మండల వ్యాప్తంగా తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రామాపురంలో తయారు చేసిన నకిలీ మద్యాన్ని హుజూర్నగర్లోనూ విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వ్యాపారులు సిండికేట్గా మారి నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మేళ్లచెర్వులో వైన్షాపును సీజ్ చేశాం
నకిలీ మద్యం కేసులో మేళ్లచెర్వుకు చెందిన శివపార్వతి మద్యం దుకాణాన్ని సీజ్ చేశాం. దుకాణంలో పనిచేస్తున్న తోట శివశంకర్ నకిలీ మద్యం కేసులో ఏ-1 ముద్దాయిగా ఉండి యజమానితో సత్సంబంధాలు కలిగి ఉండడంతో సీజ్ చేశాం.
నాగార్జునరెడ్డి, ఎక్సైజ్ సీఐ