ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:27 AM
భువనగిరి మండల వ్యాప్తంగా ఉన్న భూ పంపిణీపై నిషేధం ఎత్తివేసి పేద రైతులకు వ్యవసాయ భూములు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భువనగిరి రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): భువనగిరి మండల వ్యాప్తంగా ఉన్న భూ పంపిణీపై నిషేధం ఎత్తివేసి పేద రైతులకు వ్యవసాయ భూములు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు, దళితులు, గిరిజనులు తదితర వర్గాల ప్రజలకు భూములను పంపిణీ చేసి, వారి ఆర్థిక పరిపుష్టికి పాలకులు చొరవ చూపాలన్నారు. మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో 331 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే విధంగా చొరవ చూపాలన్నారు. లేనట్లయితే సీపీఎం ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాతి పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నాయకులు అశోక్, నాగమణి, కూకుట్ల కృష్ణ, లక్ష్మయ్య, మల్లయ్య ఉన్నారు.