ఘట్కేసర్-యాదాద్రి ఎంఎంటీఎ్సకు మోక్షం
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:18 AM
ఏళ్లుగా ఊరిస్తున్న ఘట్కేసర్-భువనగిరి ఎంఎంటీఎస్ పనులు అందరి అంచనాలకు భిన్నంగా, ఆర్భాటానికి దూరంగా ఐదు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి.
భువనగిరి మాసుకుంట వద్ద ప్రారంభమైన మూడో లైన్ మట్టి పనులు
రూ.412కోట్ల వ్యయంతో సాగుతున్న పనులు
ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు నాలుగో లైన్ నిర్మాణానికి సేకరించనున్న 79 ఎకరాల ప్రైవేట్ భూమి
(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్): ఏళ్లుగా ఊరిస్తున్న ఘట్కేసర్-భువనగిరి ఎంఎంటీఎస్ పనులు అందరి అంచనాలకు భిన్నంగా, ఆర్భాటానికి దూరంగా ఐదు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఎంఎంటీఎస్ పరుగుల కోసం భువనగిరి పట్టణ శివారులోని ముత్తిరెడ్డిగూడెం రైల్వే క్రాసింగ్ నుంచి భువనగిరి రైల్వే స్టేషన్ వైపు మట్టి చదును పనులను చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.412కోట్లతో చేపడుతున్న ఎంఎంటీఎస్ పనుల్లో మూడో లైన్ నిర్మాణానికి ఘట్కేసర్ నుంచి భువనగిరి వరకు 33కిలోమీటర్ల రైల్వే భూమిలో పనులు ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రైవేట్ భూమి తప్పని సరి కానుండడంతో త్వరలో భూసేకరణ చేపట్టనున్నారు. అప్పటి వరకు రైల్వే స్థలంలోనే మట్టి పనులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్ అవసరాల కోసం నాలుగో లైన్ నిర్మాణం కోసం ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు 39కిలోమీటర్ల పాటు 79 ఎకరాల ప్రైవేట్ స్థలాలను సేకరించేందుకు రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 3న ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ఎంఎంటీఎస్ పనులను ప్రస్తావించారు. ఈ మేరకు పనులను ప్రారంభించి మొదటి దఫాగా రూ.100కోట్లు విడుదల చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి రవ్నీత్ సింగ్ రాసిన లేఖ మంగళవారం ఎంపీ చామలకు చేరింది. కాగా, పనుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పనులు ఇలా..
ఎంఎంటీఎస్ మూడో లైన్ పనులు భువనగిరి పట్టణ ప్రధాన రహదారితో పోలిస్తే పట్టాలకు అవతలి వైపు అంటే అర్బన్ కాలనీ వైపు చేపట్టారు. దీంతో అదే మార్గంలో ఘట్కేసర్ వరకు పనులు సాగనున్నాయి. భువనగిరి రైల్వే స్టేషన్లో మూడో ప్లాట్ఫాంగా ఎంఎంటీఎస్ ప్లాట్ఫాం ఏర్పాటుచేయనున్నారు. ఎంఎంటీఎస్ పనులను ఇటీవల నిర్వహించిన టెండర్లలో ఓ ప్రముఖ ఏజెన్సీ దక్కించుకున్న వెంటనే మట్టి పనులను ప్రారంభించింది. టిప్పర్లు, ఎక్సకవేటర్లు, తదితర వాహనాలతో పనులు సాగుతున్నాయి. వాస్తవానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఘట్కేసర్ నుంచి భువనగిరి వరకు రూ.330కోట్లతో ఎంఎంటీఎస్ పనులను ప్రతిపాదించారు. ఈ మొత్తంలో రాష్ట్ర వాటాగా రూ.220కోట్లను చెల్లించాల్సి ఉండగా, మిగతా రూ.110కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉండే ది. ఈ క్రమంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానా న్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో భక్తుల సౌకర్యా ర్థం ఎంఎంటీఎ్సను రాయిగిరి వరకు పొడగించాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ, పలు కారణాలతో పనులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో పెరిగిన నిర్మాణ వ్యయం రూ.464కోట్లతో కేంద్ర ప్రభుత్వమే ఎంఎంటీఎస్ పనులను చేపడుతుందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డితో పాటు పలు మార్లు బీజేపీ నాయకులు ప్రకటించా రు. అందుకు అనుగుణంగా 2025-26 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయని ఆ పార్టీ నాయకులు... చెబుతున్నారు. రెండేళ్లలోపు పనులు పూర్తవుతాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే తక్కువ చార్జీలు, తక్కువ సమయంలో హైదరాబాద్లోని అన్ని మూలలకు జిల్లా వాసులు చేరుకునే అవకాశం లభిస్తుంది.
ప్రయాణం సులువు : అశోక్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ఘట్కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రతిపాదిత పనులు పూర్తయితే యాదాద్రి, జనగామ జిల్లా ప్రజలు సులువుగా హైదరాబాద్కు వెళ్లవచ్చు. అలాగే హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి రావచ్చు. పనులను పూర్తి చేస్తామని బీజేపీ ఇచ్చిన మాటను నిలుపుకున్నది. ఎంఎంటీఎస్ పనులకు నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు వాటా చెల్లించకపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాకు మెరుగైన ప్రయాణ వసతులు కల్పించే లక్ష్యంతో ప్రధాన నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చూపిన చొరవతో కేంద్రమే రూ.412కోట్లతో పనులను చేపట్టింది.
కృషి ఫలించింది : చామల కిరణ్కుమార్రెడ్డి, భువనగిరి ఎంపీ
ఘట్కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్ పనుల కోసం పార్లమెంట్ వేదికగా చేసిన కృషి ఫలించింది. ప్రతిపాదిత పనులను త్వరగా ప్రారంభించాలని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించడంతో పాటు రైల్వేశాఖ మంత్రి, ఉన్నతాధికారులను పలుమార్లు కలిశాం. ఈ మేరకు రూ.412కోట్లతో పనులను చేపడుతున్నట్టు, మొదటి దఫాగా రూ.100కోట్లు విడుదల చేస్తున్నట్టు రైల్వేశాఖ మంత్రి రవ్నీత్సింగ్ రాసిన లేఖ అందింది. సీఎం రేవంత్రెడ్డి కూడా కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి తెచ్చా రు. పనులు పూర్తయితే హైదరాబాద్కు రవాణా సదుపాయాలు మెరుగవుతాయి. జనగామ వరకు ఎంఎంటీఎస్ పొడిగింపునకు మరోమారు కేంద్రంతో మాట్లాడతాం.