మహిళలను ఇబ్బంది పెట్టొద్దు
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:04 AM
మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించే మహిళలను ఇబ్బంది పెట్టొద్దని, వారు ఆపమన్న చోట బస్సులు ఆపాల్సిందేనని ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి అన్నారు.
వారు ఆపమన్న చోట బస్సులు ఆపాల్సిందే
ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 29, (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించే మహిళలను ఇబ్బంది పెట్టొద్దని, వారు ఆపమన్న చోట బస్సులు ఆపాల్సిందేనని ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్టలో త్రైమాసిక ప్రగతిచక్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను సురక్షితం గా వారి గమ్యాలకు చేరవేస్తూ ఆర్టీసీపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకమైన మహాలక్ష్మి(మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం)ద్వారా మహిళలకు ఇబ్బందులు కాకుండా వారికి అవస రం ఉన్నచోట బస్సులు ఆపాలని చెప్పారు. వారిని ఇబ్బంది పెడితే ఉపేక్షించబోమన్నారు. డ్రైవర్లు మానసికంగా, వ్యక్తిగతంగా, ఆరోగ్యంగా ఉండాలన్నారు. సంస్థను లాభాల బాటలో తీసుకురావడానికి ప్రతీ కార్మికుడు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు వి.సుచరిత, ఎస్ భీమ్రెడ్డి, డీఎం మురళికృష్ణ, ఎం.శ్రీనాథ్, రామ్మోహన్రెడ్డి, ఎస్.లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దు : సుచరిత
భువనగిరి టౌన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): బస్టాండ్లలో ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని డిప్యూటీ ఆర్ఎం సుచరిత అన్నారు. మంగళవారం భువనగిరి బస్టాండ్ను ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. ఆహారపదార్థాల తయారీ, క్యాంటీన్ నిర్వహణలో ప్రమాణాలు, పరిశుభ్రత పాటించాలని, ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, ప్యాకింగ్ గూడ్స్ను ఎమ్మా ర్పీ ధరలకు విక్రయించాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రయాణికులకు తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, మహిళల మరుగుదొడ్లకు వెళ్లే మార్గానికి మరమ్మతులు చేయాలన్నారు. ప్రయాణికులతో మాట్లాడారు. యాదగిరిగుట్ట డిపో టీఐ-2 శ్రీనివాస్, బస్టాండ్ మేనేజర్ వెంకటయ్య, కంట్రోలర్ సోమరాజు, మణికంఠ, కొడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.