అవినీతిలో కాంగ్రెస్ అద్భుత ప్రగతి
ABN , Publish Date - May 28 , 2025 | 12:14 AM
ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి విషయంలో అద్భుత ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్షరెడ్డి ఎద్దేవా చేశారు.
సూర్యాపేట(కలెక్టరేట్), మే 27 (ఆంధ్రజ్యోతి) : ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి విషయంలో అద్భుత ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్షరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. అన్నిశాఖల్లో కమీషన్లు దండుకోవడమే కాంగ్రెస్ నాయకుల ఎజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దోచుకునే విషయంలోనే మంత్రులు పోటీపడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, హామీల అమలును ప్రశ్నిస్తున్న వాళ్లకు నోటీసులు ఇప్పించి భయపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఈడీ కేసులో సీఎం రేవంతరెడ్డి పేరున్నా ప్రధాని మోదీని కలవడానికి వెళ్లాడంటేనే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ దోస్తీ ఎట్లా ఉందో అర్థమవుతోందన్నారు. రేవంతరెడ్డి చిల్లర చేష్టలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్నారు. ఇతర దేశాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తూ వారి ఆహ్వానం మేరకు కేటీఆర్ అక్కడికి వెళ్తున్నారని అది తట్టుకోలేక, ఏసీబీ నోటీసులు ఇప్పించారని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జీడి భిక్షం, ఆకుల లవకుశ, బాబూనాయక్, ముదిరెడ్డి అనిల్రెడ్డి, సోమరాజు, జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.