నేటి నుంచి మఠంపల్లిలో పెద్దపండుగ తిరునాళ్లు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:34 AM
దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయం 29 వసంతాలు పూర్తయిన సందర్భంగా వార్షిక మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
మఠంపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయం 29 వసంతాలు పూర్తయిన సందర్భంగా వార్షిక మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 26 వరకు జరిగే వేడుకలకు దేవాలయాన్ని విద్యుద్దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. వేడుకల్లో భాగంగా విచారణ గురువు మార్టిన్ పసల ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఆరు గంటలకు నవదిన జపములు, దివ్యబలిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు సమష్టి దివ్యబలిపూజను పీఠాధిపతులతో నిర్వహించనున్నారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై మరియమాత విగ్రహాన్ని ఊరేగిస్తారు. అదేవిధంగా శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల బండలాగుట బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గాదె జయభరతరెడ్డి తెలిపారు.