బెల్లి లలిత ఆశయాల సాధనకు కృషి చేయాలి
ABN , Publish Date - May 27 , 2025 | 12:24 AM
తెలంగాణ కోసం బరి గీసి కొట్లాడిన వీర వనిత బెల్లి లలిత అని, ఆమె ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
భువనగిరి గంజ్, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోసం బరి గీసి కొట్లాడిన వీర వనిత బెల్లి లలిత అని, ఆమె ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లో టీయూజేఏసీ, ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన బెల్లి లలిత వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా పైళ్ల మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం, సామాజిక దురాచారాల నిర్మూలన కోసం ప్రజలను పాటల ద్వారా చైతన్యం చేసిన ప్రజా నాయకురాలు బెల్లి లలిత అని కొనియాడారు. ఆట పాటలతో ప్రజలను ఉద్యమం వైపు మళ్లించారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో బెల్లి లలిత పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఊరూరా ప్రజలను చైతన్య పరిచి తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆమె గాన కోకిలగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. రాష్ట్రంలో గుట్కా, సారా నిషేధించాలని, అప్పుడే ఆమె ఆత్మకు శాంతికలుగుతుందని, భువనగిరి, హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బెల్లి లలిత విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బెల్లి లలిత కుమారుడు సూర్య ప్రకాష్, బెల్లి చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్, బట్టు రాంచంద్రయ్య, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బీరు మల్లయ్య, రాజారాం, కొనపురి కవిత, మేక లలిత, తంగళ్లపల్లి రవికుమార్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు కావలి యాదయ్య, కాశపాక మహేష్, రాసాల నరసింహ, రాసాల బాలస్వామి, నరాల బాలకృష్ణ, ఎనుగు మల్లారెడ్డి, బాకారం లావణ్య, చేర్యాల సుగుణమ్మ, చంద్రకళ, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.