సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:28 AM
జిల్లాలో ఈ నెల 6న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి రానుండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్లో పలు శాఖల జిల్లా అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ ఎం.హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), జూన్ 3 (ఆంధ్రజ్యో తి): జిల్లాలో ఈ నెల 6న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి రానుండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్లో పలు శాఖల జిల్లా అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 6న ఉంటుందని అన్నిశాఖల అధికారులు పరస్పర సహకారంతో ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పోలీస్, అగ్నిమాపక శాఖ వైద్య ఆరోగ్యశాఖలు అప్రత్తంగా ఉండాలన్నారు. రోడ్ల మరమ్మతులు, శానిటేషన్ పనులపై దృష్టి సారించి పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) జీ.వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, డీఆర్డీవో టీ. నాగిరెడ్డి, ఏవో జగన్మోహన్ ప్రసాద్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ ఎం. హనుమంతరావు అన్నారు. టీఎస్ యూటీఎఫ్ ప్రచార వాహనాన్ని డీఈవో కే. సత్యనారాయణతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలల్లో ఉన్నత విద్యార్హతలు, వృత్తి నిబద్దత కలిగిన ఉపాధ్యాయుల కృషికి ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉన్నత ఫలితాలే నిదర్శనమన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 67 మంది విద్యార్థులకు 67 సైకిళ్లను అందజేశామని, వచ్చే ఏడాది 200 సైకిళ్లను ఉచితంగా అందజేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచిన జిల్లా, ఈ ఏడాది మరింత ముందువరుసలో నిలిచేలా చూడాలన్నారు. క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్యా బోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల గురించి మరింత విరివిగా ప్రచారం చేసి అధికంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీ ప్రశాంత్ రెడ్డి, టీ జేఏసీ రాష్ట్ర నాయకులు మందడి ఉపేందర్రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్, జిల్లా నాయకులు ఎం యాదయ్య, సైదులు, వనిత తదితరులున్నారు.