అందాల భామలే అతిథులుగా
ABN , Publish Date - May 15 , 2025 | 12:30 AM
ప్రపంచంలోని అందగత్తెలు అతిథిలుగా జిల్లాకు వస్తున్నా రు. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను, భౌగోళిక గుర్తింపు పొందిన విశేషాలను తిలకించనున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని సందర్శించి ఇక్కడి ప్రత్యేకమైన ఇక్కత్ వస్త్రాల తయారీ, చేనేత కార్మికుల జీవన శైలిని తెలుసుకోనున్నారు.
నేడు భూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్టను సందర్శించనున్న సుందరీమణులు
ప్రపంచంలోని అందగత్తెలు అతిథిలుగా జిల్లాకు వస్తున్నా రు. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను, భౌగోళిక గుర్తింపు పొందిన విశేషాలను తిలకించనున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని సందర్శించి ఇక్కడి ప్రత్యేకమైన ఇక్కత్ వస్త్రాల తయారీ, చేనేత కార్మికుల జీవన శైలిని తెలుసుకోనున్నారు. వస్త్ర సంప్రదాయాల్లో పేరెన్నికగన్న పోచంపల్లి ఇక్కత్ ఫ్యాషన్ మరోమారు ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. దేశంలోనే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట ప్రాశస్త్యాన్ని ముద్దుగుమ్మలకు వివరించనున్నారు. కృష్ణరాతి శిలలతో ఎంతో అందంగా తీర్చిదిద్దిన యాదగిరీశుడి ఆలయాన్ని అందగత్తెలు తిలకించనున్నారు. వీరి రాకతో ప్రపంచ దృష్టి జిల్లాపై పడింది. మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణులు జిల్లాలో పర్యటించనుండడంతో జిల్లాయంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆలయం శోభితం తెలిసేలా....
ఆలయాల సంస్కృతీ, సాంప్రదాయాలు తెలిసేలా కార్యక్రమాలు
యాదగిరిగుట్ట, మే 14 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ ముద్దుగుమ్మలు నేడు రానున్నారు. ఇందుకోసం ఆలయంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకోసం యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రధాన రహదారి, రింగ్రోడ్డు, మూడో ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి ట్రయల్ రన్ నిర్వహించారు. కొండపైన అతిథి గృహంలోని గదులకు అవసరం మేర రంగులు వేశారు. కొండకింద వైకుంఠద్వారం నుంచి క్షేత్రమంతా రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఇల వైకుంఠపురంగా భావించే యాదగిరికొండ కనువిందు చేస్తోంది. కాగా, ఆలయాన్ని వివిధ రకాల పూలు, మామిడి, అరటి తోరణాలతో తీర్చిదిద్దారు. కొండపైన అతిథి గృహానికి చేరుకొని బ్యాటరీ వాహనంలో అఖండ దీపారాదన వద్దకు చేరుకుంటారు. దీపారాధన అనంతరం అక్కడి నుంచి దేశీయ నృత్యాలు, తెలంగాణ సంప్రదాయ ప్రకారం కోలాటాలతో ఆలయ తూర్పు రాజగోపురం వరకు కళాకారులు స్వాగతం పలుకగా వారు ఆలయం వద్దకు చేరుకునేందుకు ఎర్ర తివాచీ పరచనున్నారు. అక్కడి నుంచి స్వర్ణ దివ్య విమాన రాజగోపురం దర్శించుకొ ని త్రితల రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి దారిలో క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామిని దర్శించుకొని నేరుగా ధ్వజస్థంభానికి మొక్కులు తీర్చుకుంటారు. అక్కడి నుంచి అంతరాలయంలోని స్వయంభువులను దర్శించుకున్న అనంతరం ఉపాలయాల్లోని ఆండాళ్ల అమ్మవారు, ఆళ్వార్ల ను దర్శించుకుంటారు. గర్భాలయానికి అభిముఖంగా వేద పండితుల వేద ఆశీర్వచనం చేస్తారు. తర్వాత ఆలయ అందాలు, లోపలి ప్రాకార మండపాలు వీక్షిస్తూ పశ్చిమ రాజగోపు రం ద్వారా ఆలయం వెలుపలికి వచ్చి ఉత్తర, తూర్పు దిక్కుల్లో బయటి ప్రాకార మండపాలు, ఏనుగుల విగ్రహాలు, యాలీ పిల్లర్లను తిలకిస్తారు.
అనంతరం తిరువీధి నుంచి బ్యాటరీ వాహనాల్లో అతిథి గృహానికి చేరుకొని అక్కడి నుంచి తిరుగుపయణమవుతారు. ఈశాన్య దిక్కు లో ప్రెస్ గ్యాలరీ, బ్రహ్మోత్సవ మండపం వద్ద ఫొటోషూట్ కోసం వేదికను ఏర్పా టు చేశారు. దేవాదాయ శాఖ డైరెక్టర్, ఈవో ఎస్. వెంకట్రావు సరస్వతి పుష్కరాల కోసం కాళేశ్వరంలో ఏర్పాట్లను చేసేందుకు ప్రభుత్వం ఆదేశించగా అందాల భామల పర్యటనను విజయవంతం చేసేందుకు కలెక్టర్ ఎం.హనుమంతరావు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరం మేరకు జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులను కూడా పురమాయిస్తున్నారు. నేరుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే జిల్లాలో పర్యటించే సమయంలో వాట్సాప్, ఫోన్ ద్వారా తగు సలహాలు, సూచనలు చేశారు. ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి క్షేత్రంగా యాదగిరిగుట్ట ప్రసిద్ధి చెందేందుకు చొరవ తీసుకున్నారు. అందాల పోటీదారులకు సంస్కృతీ, సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
భద్రత వలయంలో ఆలయం
మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో ఆలయంలో భద్రతను ముమ్మరం చేశా రు. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులకు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కొండపైన 300 మంది, కొండకింద 200 మంది పోలీసులు బందోబస్తు చేపట్టనున్నట్లు డీసీపీ ఆకాంక్ష్యాదవ్ తెలిపారు. అదేవిధంగా కొండపైన 43ఎస్పీఎఫ్, 23హోంగార్డు, 33సురక్ష సిబ్బందిచే భద్రత నిర్వహిస్తున్నట్లు ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు తెలిపారు.
చేనేత వర్ధిల్లేలా...
పోచంపల్లిలో సుందరీమణుల కోసం ఏర్పాట్లు పూర్తి
సాయంత్రం ఆరు గంటలకు రాక
ముస్తాబైన టూరిజం పార్క్ 8 ఇక్కత్ వస్త్రాల ప్రదర్శన
ప్రపంచ గుర్తింపునకు మరో ప్రయత్నం
కంట్రీయార్డ్లో మెహిందీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు..
చేనేత థీమ్పై ప్రత్యేక ప్రదర్శనలు
పోచంపల్లిలో మగ్గాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, చిత్రంలో కలెక్టర్ హనుమంతరావు
భూదాన్పోచంపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): చేనేత సంస్కృతికి ప్రతీకగా, దేశీయ సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన భూదాన్పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించనున్నారు. వీరి పర్యటనతో చేనేత ఇక్కత్ వస్త్రాలకు పుట్టినిల్లయిన పోచంపల్లి మరోసారి మరోమారు ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 25 మంది రెండు బృం దాలుగా విడిపోయి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మిస్వరల్డ్ పోటీదారులు పోచంపల్లిరూరల్ టూరిజం సెంటర్ సందర్శించడం చేనేత ప్రాముఖ్యాన్ని చాటుతోంది. సుందరీమణుల్లో ఓ బృందం చేనేత చీరలకు వాడే నూలు దారం పుట్టుక నుంచి మొదలు మగ్గంపై వస్త్రం తయారీ వరకూ చేనేత ప్రక్రియలను తెలుసుకోనున్నారు. మరో బృందం అదే సమయంలో ప్రపంచ సుందరీమణుల సందర్శన కోసం పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్ను ముస్తాబు చేస్తున్నారు. హ్యాంపీ థియేటర్లో చేనేత వస్త్రాల ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఇందులో సిద్ధిపేట జిల్లాకు చెందిన గొల్లబామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, సిల్కు, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్లు, రజాయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్స్, దుప్పట్టా, టేబుల్ కర్టెన్స్ పిల్లో కవర్స్ తదితర వెరైటీలను ప్రదర్శించున్నారు. కొన్ని వస్త్రాలను స్థానిక మహళలు ధరిస్తారు. వీటిని రెండు బృందాల్లోని సుందరీమణులు సందర్శిస్తారు.
ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్ షో...
ప్రపంచ సుందరీమణులకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల విశిష్ఠత ను తెలియజేసే కార్యక్రమాలను హ్యాంపీ థియేటర్లో ఏర్పాటు చేశారు. సాంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ఫ్యాషన్ డిజైనర్లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి ప్రపంచ సుందరాంగుల ముందు ఫ్యాషన్ షో ప్రదర్శిస్తారు. ఇదే సందర్భంలో ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత, విశిష్ఠతను కార్మికుల ముఖాముఖి ద్వారా సుందరీమణులు తెలుసుకోనున్నారు. తెలంగాణ టూరిజం ప్రాముఖ్యాన్ని తెలిపేలా టూరిజం శాఖ వారు వీడియోలను ప్రదర్శించనున్నారు.
చేనేతకు మరింత ప్రాచుర్యం...
చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథ మ లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి ఇక్కత్ వస్త్రాల విశిష్ఠతను తెలియజేయడం వల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయం గా మంచి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి చేనేత కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లి ప్రాంతా న్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం సాగుతోంది. ఈ సందర్భంలో సుందరీమణుల రాక పర్యాటకంగా నూ మరింత ప్రోత్సాహాన్ని తేనుంది.
టూరిజం పార్క్ ముస్తాబు...
సుందరీమణులు సందర్శించే పోచంపల్లి టూరిజం సెంటర్ను అన్నిఏర్పాట్లతో ముస్తాబుచేశారు. రాష్ట్ర గ్రామీణ వాతావరణం కనిపించేలా జాజు రంగులో గోడలను, వాటిపై ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఒక ప్రత్యేక వాతావరణం కనిపించేలా విద్యుత్ కాంతుల మధ్య పార్క్ను అలంకరించారు. అదేవిధంగా పట్టణంలోని డివైడర్ల మధ్యలో విద్యుత్ స్తంభాలు జాతీయ జెండాలోని రంగుల లైట్లతో వెలిగిపోతున్నాయి. ఈ పర్యటన విజయవంతం కోసం సుమారు 1000 మందితో పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి మొదలయ్యే కార్యక్రమం రాత్రి 10.30 గంటలకు పూర్తవుతందని అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
చేనేతలో వినూత్న డిజైన్లు: బోగ సరస్వతి, స్టేట్ అవార్డు గ్రహీత, భూదాన్పోచంపల్లి
మా కృషి, దృష్టి అంతా డిజైన్లు, డైయింగ్, టైయింగ్, మోటివ్స్, షేడ్స్, వీవింగ్ పైనే ఉంటుంది. నచ్చిన డిజైన్లకు ఎక్కువ మొత్తంలో కోరితే డిమాండ్ను తగ్గట్టు తయారు చేస్తుంటాం. సాంప్రదాయ ఏనుగులు, పక్షులు మాత్రమే కాకుండా మార్కెట్ ట్రెండ్ను అనుసరించి డిజైన్స్ చేస్తున్నాం. రాజకీయ నాయకులు, ప్రముఖులు మా వద్ధ నుంచి చీరలు తీసుకెళ్తున్నారు. బాలీవుడ్ నటి జయాబచ్చన్, ఇన్ఫోసిస్ సుధామూర్తికి కూడా మా చీరలు వెళ్తాయి. జాతీయస్థాయిలో మా డిజైన్లకు గుర్తింపు రావాలని మేము సాధన చేస్తున్నాం.