నియోజకవర్గానికి రూ.56కోట్ల హెచ్ఎండీఏ నిధులు
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:28 AM
ని యోజవర్గానికి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.75కోట్ల నిధులు రాగా, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రూ.56కోట్ల హెచ్ఎండీఏ నిధులు రాబట్టామని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.
కుంభం అనిల్కుమార్రెడ్డి
భువనగిరిటౌన్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ని యోజవర్గానికి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.75కోట్ల నిధులు రాగా, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రూ.56కోట్ల హెచ్ఎండీఏ నిధులు రాబట్టామని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భువనగిరి మునిసిపల్ పరిధిలో రూ.13.60 కోట్లు, మండలంలో రూ.9.50కోట్ల హెచ్ఎండీఏ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సోమవారం భువనగిరిలో ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.బీబీనగర్ మండలంలో రూ.16 కోట్లు, పోచంపల్లి మండలంలో రూ.16కోట్ల హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్టు తెలిపారు. మొత్తం రూ.56కోట్ల హెచ్ఎండీఏ నిధులతో నియోజకవర్గంలోని వలిగొండ మినహా మిగతా మూడు మండలాల్లోని సుమారు 125 గ్రామాలు, రెండు మునిసిపాలిటీల్లోని 50వార్డుల్లో ఏకకాలంలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నింటినీ విస్తరిస్తామన్నారు. రూ.500కోట్లతో సాగునీటి కాల్వల పనులు, రూ.60కోట్లతో భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనులు సాగుతుండగా, త్వరలో రూ.30కోట్లతో క్రీడా స్టేడియం పనులు ప్రారంభంకానున్నట్టు తెలిపారు. మార్కెట్ యార్డులో హమాలీల విశ్రాంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.1.95కోట్లతో పట్టణ ప్రధాన రహదారి ఫుట్పాత్ టైల్స్ పనులు ప్రారంభం కాగానే, శాశ్వతంగా ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించామన్నారు. రూ.23.10కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సరైన సంఖ్యలో కార్యకర్తలు హాజరు కాకపోవడం తనకు అసంతృప్తిగా ఉందని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎండీ.అవేజ్చిస్తి, మునిసిపల్ కమిషనర్ జి.రామలింగం, డీఈ కొండల్రావు,మునిసిపల్ మాజీ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, కూర వెంకటేష్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, చిక్కుల వెంకట్, పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ అభివృద్ధి
(ఆంధ్రజ్యోతి, భువనగిరి రూరల్): ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చందుపట్ల, కూనూరు, వీరవెల్లి, ముస్త్యాలపల్లి గ్రామాల్లో రూ.9.5కోట్ల హెచ్ఎండీఏ నిధులతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అవేజ్ చిస్తీ, ఏఎంసీ చైర్మన్ కనుకుంట్ల రేఖబాబురావు, నాయకులు తంగెళ్లపల్లి రవికుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, పక్కీరు కొండల్రెడ్డి, నానం కృష్ణ, పాశం శివ, గడ్డమీది వీరస్వామి, సుక్క స్వామి, రావి సురేశ్రెడ్డి, పీఆర్ డీఈఈ దాసయ్య, పాల్గొన్నారు.