Share News

27.4తులాల బంగారు ఆభరణాలు చోరీ

ABN , Publish Date - May 10 , 2025 | 12:06 AM

దామరచర్ల, మే 9(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఓ నగల దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

  27.4తులాల బంగారు ఆభరణాలు చోరీ

దామరచర్ల, మే 9(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఓ నగల దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దామరచర్ల మండల కేంద్రంలోని విజయశ్రీ జ్యూయలరీ దుకాణం నిర్వాహకుడు కాళె బ్రహ్మయ్య గురువారం రాత్రి 9 గంటలకు దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున 2.15 గంటలకు మెలకువ రావడంతో తన స్మార్ట్‌ఫోన్‌ నుంచి దుకాణం వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పరిశీలించి అన్ని వస్తువులు సక్రమంగా ఉన్నట్లు గుర్తించాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మొబైల్‌లోని సీసీ కెమెరాలను ఆన్‌ చేసేందుకు ప్రయత్నించగా కనెక్ట్‌ కావడం లేదు. దీంతో అనుమానంతో వెంటనే ఇంటివద్ద నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న దుకాణం వద్దకు ఉదయం 4 గంటల సమయంలో వచ్చి చూడగా రాళ్లతో షట్టర్‌ తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించాడు. లోపలికి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించాడు. మొత్తం 27.4 తులాల వివిధ రకాల ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చోరీకి పాల్పడిన ముసుగులు ధరించిన దొంగలు తొలుత సీసీ కెమెరా వైర్లను తొలగించి, బంగారు ఆభరణాలతోపాటు సీసీ కెమెరాకు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నల్లగొండ నుంచి వచ్చిన క్లూస్‌ టీం బృందం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. నగల దుకాణంలో చోరీ జరిగిన ప్రాంతాన్ని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రూరల్‌ సీఐ పీఎండి.ప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:06 AM