Heart attack: కూతురి అప్పగింతలు చేస్తూ కుప్పకూలిన తల్లి
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:20 AM
పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతున్న కూతురికి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై గుండెపోటుతో ఆమె తల్లి మృతిచెందింది.
తీవ్ర భావోద్వేగానికి గురై గుండెపోటుతో మృతి
కామేపల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతున్న కూతురికి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై గుండెపోటుతో ఆమె తల్లి మృతిచెందింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం గ్రామంలో ఆదివారం జరిగింది. అబ్బాసుపురం గ్రామానికి చెందిన బానోత్ మోహిలాల్, కల్యాణి(40) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె సింధు వివాహం టేకులపల్లికి చెందిన బాలాజీతో ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది.
వివాహం అనంతరం సాయంత్రం అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో అల్లుడితో పాటు వియ్యపువారికి కూతురిని అప్పగిస్తూ.. భావోద్వేగానికి గురైన కల్యాణి గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందింది. ఆమె మృతితో పెళ్లింట విషాదం అలముకుంది.