Sponsorship Failures: పైసలిస్తామన్నా.. పట్టించుకోలే!
ABN , Publish Date - May 15 , 2025 | 04:13 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు నిధులిస్తామని ముందుకొచ్చిన స్పాన్సర్లు... అధికారుల నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోయారు.
కొందరు అధికారుల నిర్లక్ష్యంతో
మిస్ వరల్డ్ పోటీల స్పాన్సరర్లు వెనక్కి..
ఫలితంగా సర్కారుపై 27 కోట్ల భారం
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు నిధులిస్తామని ముందుకొచ్చిన స్పాన్సర్లు... అధికారుల నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోయారు. ఫలితంగా స్పాన్సర్ల నుంచి వస్తాయని ఆశించిన నిధులు రాలేదు. దీంతో పోటీల నిర్వహణకు ప్రభుత్వ వాటాగా ఖర్చు చేయాల్సిన సొమ్ము మొత్తం ఖజానా నుంచే భరించాల్సి వస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు సుమారు రూ.54 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 50 శాతం అంటే రూ.27 కోట్ల వరకు మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థ భరిస్తుండగా మిగతా సగం నిర్వహణ రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం సర్దుబాటు చేయాలి. ఈ మొత్తం రూ.27 కోట్లలో రూ.25 కోట్ల వరకు స్పాన్పర్ల నుంచి సమకూరుతుందని భావించారు. పలు సంస్థల నిర్వాహకులతో చర్చలు జరపగా స్పాన్సర్షి్పకు అంగీకరించారు. కానీ కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి స్పాన్సర్లను పట్టించుకోకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక కేంద్రాలు, చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతాలు, హస్తకళా ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం కావడంతో పాటు తమ తమ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు స్పాన్సర్షి్పకు ముందుకొచ్చాయి.
దీంతో ప్రభుత్వం ఖజానాపై భారం పడకుండా ఆయా సంస్థల సహకారంతో మిస్ వరల్డ్ పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసింది. మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థ ప్రతినిధుల సమన్వయంతో మే 10 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీదారులతో భారీ ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో పర్యాటక శాఖ అధికారులు వివిధ శాఖల సమన్వయంతో మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా ఏర్పాట్లు చేశారు. ఏ కార్యక్రమానికి ఎవర్ని స్పాన్సర్గా ఎంపిక చేయాలో, ఏ మేరకు ఆర్థిక సాయం పొందాలో ఖరారు చేసే బాధ్యత ప్రభుత్వం పర్యాటక శాఖ అధికారులకు అప్పగించింది. స్పాన్సర్లను ఆహ్వానించి చర్చించే బాధ్యతలు తీసుకున్న అధికారుల్లో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయా సంస్థలు వెనక్కి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో భారం సర్కారు ఖజానాపై పడింది.