పాలమూరుకు ప్రపంచ సుందరీమణులు
ABN , Publish Date - May 08 , 2025 | 11:48 PM
మిస్ వరల్డ్ - 2025 పోటీల్లో పాల్గొననున్న సుందరీమణులు ఈనెల 16న పాలమూరుకు రానున్నారు.
- ఈనెల 16న పిల్లలమర్రి సందర్శన
- పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
- మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్నగర్ న్యూటౌన్, మే 8 (ఆంధ్రజ్యోతి) : మిస్ వరల్డ్ - 2025 పోటీల్లో పాల్గొననున్న సుందరీమణులు ఈనెల 16న పాలమూరుకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పిల్లల మర్రిని సందర్శించనున్నారు. వారి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం పిల్లలమర్రిని సందర్శించిన కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ సుందరీమణులు దాదాపు 750 ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి వృక్షం, పురావస్తు మ్యూజియం, పక్కనే ఉన్న రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించనున్నారని తెలిపారు. వారికి స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సౌండ్, లైటింగ్, పటిష్ట భద్రత, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్ తదితర ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని వివిధ శాఖల అధికారులను అదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ డి జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎఫ్వో సత్యనారాయణ, డీఆర్డీవో నర్సింహులు, నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఆర్డీవో నవీన్, డీఈవో ప్రవీణ్ కుమార్, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.