కేబినెట్ దృష్టికి తీసుకెళ్తా
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:18 PM
అంగన్వాడీ టీచర్ల సమస్యలను కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రచారం కోసం మంత్రుల ఇళ్లను ముట్టడించడం ద్వారా ఒరిగేదేమి లేదని, సమస్యల పరిష్కారం కోసం చర్చించుకుందామని చెప్పారు.
అంగన్వాడీ సమస్యలపై మంత్రి వాకిటి శ్రీహరి
తన ఇంటిని ముట్టడించిన వారిని లోపలికి ఆహ్వానించిన మంత్రి
మక్తల్ రూరల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ టీచర్ల సమస్యలను కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రచారం కోసం మంత్రుల ఇళ్లను ముట్టడించడం ద్వారా ఒరిగేదేమి లేదని, సమస్యల పరిష్కారం కోసం చర్చించుకుందామని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, సీఐటీయూ నాయకులు సోమవారం మక్తల్ పట్టణంలోని మంత్రి ఇంటి ముట్టడికి వచ్చారు. వారిని తన నివాస ప్రాంగణంలోకి ఆహ్వానించిన మంత్రి సమస్యలను విన్నారు. అనంతరం మాట్లాడుతూ.. 1975లో అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన తరువాత గ్రామీణ బాలల ఆరోగ్యానికి, విద్యకు అవి ఎంతగానో తోడ్పడుతున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు తెలిపిన అన్ని సమస్యలను త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో మంజుల, వెంకట్రాంరెడ్డి, గోవిందురాజు, ఆంజనేయులు, రమేశ్, అంగన్వాడీ టీచర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.