బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని మేం చేసి చూపిస్తున్నాం
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:46 PM
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అభివృద్ధిని తాము 18 నెలల కాలంలోనే చేసి చూపిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఎంఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు రేషన్కార్డు ప్రొసిడింగ్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్
చిన్నచింతకుంట, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అభివృద్ధిని తాము 18 నెలల కాలంలోనే చేసి చూపిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఎంఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు రేషన్కార్డు ప్రొసిడింగ్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం మిత్తి కట్టుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. బీఆర్ఎస్ చిన్నచింతకుంటలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయలేదని, ఒక్క రేషన్ కార్డు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ, చిన్నచింతకుంటలో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. పేదలకు రేషన్ కార్డు ఆత్మగౌరవం లాంటిదని, అలాంటి ముఖ్యమైన రేషన్ కార్డులను గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పేదలు ఇబ్బందులు పడ్డారన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను మంజూరు చేశామన్నారు. దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా 3,625 ఇళ్లు మంజూరు చేశామని, అందులో 2,100 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్రెడ్డి, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కతలప్ప, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, జైపాల్రెడ్డి, శ్రావణ్, అశోక్, మహమ్మద్ పాల్గొన్నారు.