అభ్యంతరాల పరిశీలనకు నేడు ఆఖరు
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:22 PM
పాలమూరు కార్పొరేషన్ డివిజన్ల విభజనపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన సోమవారంతో ముగియనుంది. విభజనపై అధికారులు ఈ నెల 11 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. 5 రోజుల పాటు నేటి సాయంత్రం వరకు వాటిని పరిశీలిస్తారు. అందులో మార్పులు చేయాల్సినవి ఉంటే మారుస్తారు.
పాలమూరు కార్పొరేషన్ డివిజన్ల విభజనపై రేపు కలెక్టర్కు నివేదిక..
21న ఫైనల్ నోటిఫికేషన్
మహబూబ్నగర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పాలమూరు కార్పొరేషన్ డివిజన్ల విభజనపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన సోమవారంతో ముగియనుంది. విభజనపై అధికారులు ఈ నెల 11 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. 5 రోజుల పాటు నేటి సాయంత్రం వరకు వాటిని పరిశీలిస్తారు. అందులో మార్పులు చేయాల్సినవి ఉంటే మారుస్తారు. అన్ని డివిజన్ల నుంచి మొత్తం 94 అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు కాగా, కొన్ని మాత్రం ఏకంగా కాలనీల మార్చాలని వచ్చాయి. వాటిని మార్చాలంటే మొత్తం విభజనపైనే ప్రభావం పడనుంది. వాటిని మారుస్తారా? లేదంటే అలానే ఉంచుతూ మార్పు సాధ్యం కాదని నివేదిక సమర్పిస్తారా? అన్నది ఫైనల్ నోటిఫికేషన్లో వెలువడనుంది. సోమవారం సాయంత్రం వరకు అభ్యంతరాలన్నింటిని పరిశీలించి మంగళవారం కలెక్టర్కు నివేదిస్తారు. పరిశీలిన అనంతరం ఆ జాబితాను మళ్లీ ఎక్కడా ప్రచురించరు. ఎవరైతే అభ్యంతరాలు ఇచ్చారో ఆ వ్యక్తికి మాత్రం వారిచ్చిన అభ్యంతరాలను ఏం చేశారనే కారణాలను తెలియజేస్తారు. కలెక్టర్ నుంచి ఈనెల 19న సీడీఎంఏకు నివేదికను సమర్పిస్తే 20న ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఈనెల 21న ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడే ఏ డివిజన్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? డివిజన్ల లోకేషన్, ఇంటి నెంబర్లు, ప్రాంతాలు తెలియనున్నాయి.