ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - May 17 , 2025 | 11:11 PM
నెల 22 నుంచి 29వరకు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్నగర్ కలెక్టరేట్, మే 17 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 22 నుంచి 29వరకు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకు 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రథమ సంవంత్సరం 5,787 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 3,282 మంది విద్యార్థులు, మొత్తం 9069 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. అందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఐఈవో కౌసర్ జహాన్ తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటాయని, ఈ పరీక్షలు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవంత్సరం విద్యార్థులకు మాత్రమేనని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.