నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:22 PM
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్తో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చిందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
- కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల రధ్నా
పాలమూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్తో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చిందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు చేపట్టిన ధర్నాకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లిష్ మీడియం విద్య పేరుతో ఆరేళ్లలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించటం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సిఫార్సులను అమలు చుస్తోందని, ఐసీడీఎస్ను నిర్వీర్య పరచడానికి నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్ఘం అన్నారు. విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్కు ఇవ్వాలన్నారు. వలంటీర్లకు ఇచ్చే అదనపు వేతనం అంగన్వాడీలకు ఇవ్వాలన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, దీప్లానాయక్, ఖమర్అలీ, కిల్లె గోపాల్, సత్తయ్య మాట్లాడుతూ పోశన్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్సర్ (ఎఫ్ఆర్ఎస్) రద్దు చేయాలన్నారు. కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రత, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని పై అధికారుల వేధింపులు ఆపాలన్నారు. అనంతరం కలెక్టర్ విజయేందిర బోయిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గౌసియాబేగం, సరోజన కమల, నవిత, రాజేశ్వరి, కవిత, పద్మ, స్వాతి, సుజాత, భారతి, లీలావతి, నర్మద, నాగలక్ష్మి పాల్గొన్నారు.