వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:19 PM
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
- పందుల పెంపకందారుల మధ్య ఘర్షణ
- తీవ్రంగా గాయపడిన మరో నలుగురు
వెల్దండ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి పట్టణానికి చెందిన బెల్లంకొండ రాములు, రాంచంద్రయ్య, నిరంజన్, అంజిలు పెంచుతున్న 12 పందులు ఇటీవల చోరీకి గురయ్యాయి. బాధితులు వెతుకుతున్న సందర్భంలో వెల్దండ సమీపంలోని లక్ష్మపురం చెరువు వద్ద మానుపాటి వెంకటమ్మ వ్యవసాయ పొలంలో కనిపించాయి. ఈ విషయంపై కల్వకుర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం 12 పందులను తీసుకెళ్తేందుకు క ల్వకుర్తికి చెందిన ఆ నలుగురు వెంకటమ్మ వ్యవసాయ పొలం వద్దకు వచ్చారు. వెంకటమ్మకు, రాములుకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. వెంకటమ్మ కుమారులు అన్వేష్, పవన్, శివలు కల్వకుర్తి నుంచి వచ్చిన వారిపై కర్రలు, కత్తులతో దాడిచేశారు. దీంతో రాములు(40) తీవ్రంగా గాయపడ్డారు. రాములును బొలేరో వాహనంలో కల్వకుర్తికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. ఘర్షణలో వెంకటమ్మతో పాటు రాంచంద్రయ్య, నిరంజన్, అంజిలు గాయపడ్డారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.