జిల్లాను ముందు వరుసలో నిలపాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:47 PM
మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ, ఉపాధి హామీ కార్యక్రమాల్లో జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు.

మహబూబ్నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ, ఉపాధి హామీ కార్యక్రమాల్లో జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీపీఎం, ఏపీఎంలతో వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఎల్ఆర్ఎస్ తదితర కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఉపాధి హామీ కింద గరిష్ట వేతన రేటు రూ.307 పెంచినందున జాబ్కార్డు కూలీలు గరిష్ట వేతనం పొందేలా కొలతలు వేసి పనులు నిర్వహించాలన్నారు. రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తుల గడువు ముగిసినందున దరఖాస్తులు ఆన్లైన్ వచ్చినవి డౌన్లోడ్ చేసుకొని ఈనెల 20 లోగా పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 18 నుంచి 21 వరకు ఇందిరమ్మ కమిటీలు, అర్హుల జాబితాను పరిశీలన చేయాలని ఆదేశించారు.