అందగత్తెల రాకతో పిల్లలమర్రికి ప్రపంచ ఖ్యాతి
ABN , Publish Date - May 09 , 2025 | 11:14 PM
ప్రపంచ సుందరీమణులు పాలమూరుకు రానున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు ‘మిస్ వరల్డ్ - 2025’ వేడుకలు జరుగనున్నాయి.

- పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు
- 16న జిల్లాకు రానున్న 22 మంది అమెరికన్ భామలు
- సాయంత్రం 2 గంటల పాటు మహావృక్షం వద్ద సందడి
- మహిళా పోలీసులతో ప్రత్యేక బందోబస్తు
- ఏర్పాట్లపై సమీక్షించిన ఉన్నతాధికారులు
మహబూబ్నగర్, మే 9 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ సుందరీమణులు పాలమూరుకు రానున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు ‘మిస్ వరల్డ్ - 2025’ వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న సుందరీమణులను బృందాలుగా విభజించి రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలకు పంపిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరుకు అమెరికా గ్రూప్నకు చెందిన 22 మంది భామలు వస్తున్నారు. పట్టణ సమీపంలోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రెండు గంటల పాటు వారందరూ మహావృక్షం వద్ద సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంతో పాలమూరు పేరు ప్రఖ్యాతులు, పిల్లలమర్రి ప్రత్యేకతలు ప్రపంచానికి తెలియనున్నాయి. సుందరాంగుల పర్యటన సజావుగా సాగేలా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి, పరిస్థితులను అధ్యయనం చేశారు. చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాకు రానున్న సుందరీమణులకు పిల్లలమర్రి మహావృక్షంతో పాటు ఇక్కడి పురాతన దేవాలయం, మ్యూజియం, జింకలపార్కులను చూపించాలని నిర్ణయించారు. .
ప్రత్యేక అతిథులను ఆకట్టుకునేలా..
పాలమూరుకు ప్రత్యేక అతిథులుగా రానున్న ప్రపంచ సుందరీమణులను ఆకట్టుకునేలా పిల్లలమర్రి ప్రాంతాన్ని తీర్చిదిదేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఈవెంట్ మేనేజర్లను రంగంలోకి దించారు. వాల్ పెయిటింగ్, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరి, మహావృక్షం వద్ద ఆకర్షణీయమైన పూలతొట్లు, ఫొటోలు దిగేందుకు వ్యూ పాయింట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లతో మరో వారం రోజుల్లో పిల్లలమర్రి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
మిస్ వరల్డ్ - 2025 పోటీల్లో పాల్గొననున్న సుందరీమణులు పాలమూరు సందర్శనకు రానున్న నేపథ్యంలో మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. వారు పిల్లలమర్రిలో గడిపే రెండు గంటల సమయంతో పాటు, వారు వచ్చి, తిరిగి వెళ్లే వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. అందు కోసం దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీస్శాఖ ప్రణాళికను రూపొందించింది. మొదటి అంచెలో సుందరీమణుల చుట్టూ వలయంలా మహిళా పోలీసులు భద్రత కల్పిస్తారు. అందుకోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహిళా పోలీసులంతా తరలి రానున్నారు. మిగతా రెండు అంచెల్లో వివిధ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది ఉంటారు. వారందరూ రోడ్డుమార్గంలో ఏసీ బస్సులో పిల్లలమర్రికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దు అయిన బాలనగర్ శివారు నుంచి పిల్లలమర్రి వరకు దారిపొడవునా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
సమీప గ్రామాల్లో విస్తృత తనిఖీలు
పిల్లలమర్రి పర్యాటక కేంద్రం సమీప గ్రామాలైన దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, సత్యమన్నకాలనీ, బోయపల్లి, హనుమాన్తండాలతో పాటు ఇతర ఆవాసాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాలు, అవాసాల్లో నివసిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇళ్ళల్లో ఎవరు ఉంటారు, అద్దెకు ఎవరు ఉంటున్నారు తదితర వివరాలు తెలుసుకోవడంతో పాటు, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నేరచరిత్ర ఉన్న వారి వివరాలను ఇప్పటికే సేకరించారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. 16న సాయంత్రం మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు వాహనాల రాకపోకలను దారి మళ్ళించనున్నారు.