టెట్.. టెన్షన్
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:59 PM
ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో టీచర్లు ఉలిక్కి పడ్డారు. ఐదేళ్ల పైబడి సర్వీస్ ఉన్న ఇన్ సర్వీ్సలో గల ఏపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్టు) అర్హత పరీక్షరాసి ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగం వదులుకోవాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చే స్తోంది.
ఉపాధ్యాయులు రెండేళ్ల వ్యవధిలో టెట్ అర్హత సాధించాలన్న సుప్రీం
తీర్పును పునఃసమీక్షించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
2010 నోటిఫికేషన్ కంటే ముందు నియామకం అయిన వారికి మినహాయింపు ఇవ్వాలనే వాదన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలంటున్న నాయకులు
మహబూబ్నగర్ విద్యావిభాగం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో టీచర్లు ఉలిక్కి పడ్డారు. ఐదేళ్ల పైబడి సర్వీస్ ఉన్న ఇన్ సర్వీ్సలో గల ఏపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్టు) అర్హత పరీక్షరాసి ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగం వదులుకోవాల్సిందేనని ఈ తీర్పు స్పష్టం చే స్తోంది. ఈ నిర్ణయం అన్యాయమని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2010లో నోటిఫికేషన్
టెట్ అర్హత పరీక్షకు సంబంధించి 2010 ఆగస్టు 23న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీఈటీ) కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో జారీలో ముందు పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చింది.
రెండేళ్ల గడువుతో ఆందోళన
రెండేళ్ల గడువులో టెట్లో అర్హత సాధించాలన్న సుప్రీం కోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది సీనియర్ ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి పాఠాలు బోధిస్తున్నారు. వయస్సు, ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతలు వంటి కారణాలతో మళ్లీ చదివి, పరీక్షకు సిద్ధం కావడం చాలా కష్టమని అలాంటి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి లక్షలాది మంది టెట్ పరీక్షకు హాజరు కావాల్సి వస్తే నిర్వహణ సమస్యలు ఎదురవుతాయని విద్యావేత్తలు అంటున్నారు. ఉపాధ్యాయులు టెట్ వద్దని, తీర్పును సుప్రీం కోర్టు పునఃసమీక్షించాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యా వేత్తలు అంటున్నారు. 2010 నోటిఫికేషన్ కంటే ముందు నియామకం అయిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. విద్యా రంగంలో అనుభవమే గొప్ప అర్హత అని, సీనియర్ టీచర్ల బోధన నైపుణ్యాలను కేవలం టెట్ పరీక్షతో కొలవలేమని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు తక్షణమే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం
సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వాలు పునఃసమీక్షించాలి. దీని వల్ల చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ నిర్ణయం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, న్యాయ నిపుణులతో సంప్రదించి ఉపాధ్యాయులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకోవాలి.
- మదన్మోహన్ యాదవ్, టీఎస్ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్