ఉపాధ్యాయులే తనిఖీ అధికారులు
ABN , Publish Date - Jun 23 , 2025 | 10:46 PM
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పాఠశాలల పర్యవేక్షణకు ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమించనుంది. ప్రస్తుతం ప్రతీ మండలంలో పాఠశాలల పర్యవేక్షణ కోసం కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈవోలు అధికారులుగా ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా గవర్నమెంట్ అడుగులు
కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో ఎంపిక చేయాలని ఆదేశాలు
కనీస వసతులు, బోధన, హాజరు వంటి వాటి పరిశీలన
ఉమ్మడి జిల్లాలో 2,922 పాఠశాలు.. 207 క్లస్టర్లు
నారాయణపేట, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పాఠశాలల పర్యవేక్షణకు ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమించనుంది. ప్రస్తుతం ప్రతీ మండలంలో పాఠశాలల పర్యవేక్షణ కోసం కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈవోలు అధికారులుగా ఉన్నారు. తాజాగా ఉపాధ్యాయులను కూడా తనిఖీ అధికారులుగా నియమించనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో వారిని ఎంపిక చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకోసం పదేళ్ల అనుభవం ఉన్న వారిని ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 4న నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరిశీలన ఇలా..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 2,922 ప్రభుత్వ పాఠశాలలు, 207 క్షస్టర్లు ఉన్నాయి. తనిఖీ అధికారులుగా నియమితులైన ఉపాధ్యాయులు జిల్లా పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేస్తారు. మౌలిక వసతులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, క్రీడలు, డిజిటల్ విద్యా బోధన, విద్యార్థుల ఆరోగ్యం, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీలు, విద్యుత్ సౌకర్యం, క్రీడా స్థలాలు ఉన్నాయా? లేవా? అని పరిశీలించాలి. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందుతున్నాయా? అని తెలుసుకోవాలి. మధ్యాహ్న భోజన పథకం అమలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వంటివి పరిశీలించి, డీఈవోలకు ప్రతీ నెల 5వ తేదీ లోపు నివేదికలు ఇస్తారు. వాటిని ప్రతీ నెల కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్షిస్తారు. ఎంపికైన ఉపాధ్యాయులు ఏడాది పాటు పని చేస్తారు. నిబంధనల ప్రకారం నారాయణపేట జిల్లాలో పీఎస్ల పరిధిలో ఇద్దరు, యూ పీఎస్ల పరిధిలో ఒకరు, ఉన్నత పాఠ శాలల పరిధిలో ఒక ఉపాధ్యాయుడిని నియమించే అవకాశం ఉంది.
నియామకం ఇలా..
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల తనిఖీ కోసం కనీసం పదేళ్ల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లేదా ఎస్జీటీలను నియమించుకోవచ్చు. వారు నిత్యం రెండు పాఠశాలలను తనిఖీ చేయాలి. మూడు నెలలకు 100 పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉంటుంది.
ప్రాఽథమికోన్నత పాఠశాలల తనిఖీ కోసం కనీసం పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్లను నియమించుకోవాలి. వీరు రోజూ రెండు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది.
ఉన్నత పాఠశాలల తనిఖీ కనీసం పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలి. వీరు రోజుకు ఒక స్కూల్ ప్రకారం మూడు నెలల్లో 50 స్కూల్స్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. దాంతో పర్యవేక్షణ పెరిగి పాఠశాలల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది.